స్టాక్ మార్కెట్స్..మఠాష్: రిలయన్స్ సహా అన్నీ ఢమాల్: 1,500 పాయింట్లకు పైగా
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్.. ఇవ్వాళ భారీగా పతనమైంది. సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలిపోయాయి. షేర్లన్నీ రెడ్ జోన్లో కనిపించాయి. అన్ని సెక్టోరల్ షేర్లన్నీ మఠాష్ అయ్యాయి. ఐటీ, రియాల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్.. ఇలా దాదాపు అన్ని సెగ్మెంట్స్కు చెందిన షేర్లు నష్టాలను చవి చూశాయి. బెంచ్మార్క్ ఇండైసెస్ అన్నీ మైనస్లల్లో పడిపోయాయి.
1,500 పాయింట్లు లాస్..
ఈ ఉదయం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో 1,500 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్ ఆరంభమైంది. సెన్సెక్స్ 1,415.89 పాయింట్ల నష్టంతో మొదలైంది. 52,887.55 పాయింట్లతో ప్రారంభమైన ట్రేడింగ్ ఆ తరువాత ఇంకా కిందికి దిగజారింది. ఒకదశలో 52,740.93 పాయింట్లకు క్షీణించింది. కొంత తేరుకుంది. తొలి గంట గడిచే సమయానికి 52,867 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
అదే బాటలో నిఫ్టీ..
నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది. 420 పాయింట్లను నష్టపోయింది. తొలి గంటలో 15,781 పాయింట్ల మేర పతనమైంది. 15,877.55 పాయింట్లతో ట్రేడింగ్ ఆరంభమైన నిఫ్టీ.. ఏ దశలోనూ పుంజుకోలేదు. మరింత క్షీణిస్తూ వచ్చింది. కనిష్ఠంగా 15,752.80 పాయింట్లకు దిగజారింది. తొలిగంట ముగిసే సమయానికి 5,788.65 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.
వారం తొలిరోజే..
వారం తొలిరోజే నష్టాలను చవి చూడాల్సి రావడంల ఇన్వెస్టర్లకు ఉసూరుమనిపించింది. ఐటీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, స్టీల్.. సెగ్మెంట్స్కు చెందిన షేర్లు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో వంటి ఐటీ షేర్లు దెబ్బతిన్నాయి. వాటితో పాటు ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్కు చెందిన హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్, ఐటీసీ స్టాక్స్ ధరలు పడిపోయాయి.
క్రూడాయిల్ ఎఫెక్ట్..
బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఆసియన్ పెయింట్స్ షేర్లు రెండుశాతం మేర క్షీణించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు కూడా ఇవ్వాళ నష్టాలబారిన పడ్డాయి. మరింత దిగజారడం కనిపించింది. ఇంట్రాడే ట్రేడింగ్ మొత్తం ఇలాగే ఉండొచ్చంటూ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. సౌదీ అరేబియా క్రూడాయిల్ రేట్లను పెంచడం, రిటైల్ ద్రవ్యోల్బణం.. మార్కెట్ను ప్రభావితం చేస్తోన్నాయని చెబుతున్నాయి.
నష్టపోయిన షేర్లివే..
నెస్ట్లె ఇండియా, హిందుస్తాన్ యూనిలివర్, మారుతి సుజుకి, సన్ ఫార్మా, భారతి ఎయిర్టెల్, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టైటాన్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్ర, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్.. ఇలా అన్ని సెగ్మెంట్స్ షేర్లు నష్టపోయాయి.