పెట్టుబడుల ఉపసంహరణపై నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?
కేంద్ర బడ్జెట్లో ప్రయివేటీకరణకు పెద్దపీట వేయడం కుటుంబ ఆస్తులను విక్రయించడమేనని ప్రతిపక్షం ఆరోపణలు చేసింది. దీనిపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం స్పందించారు. ఆరోపణలను తోసిపుచ్చారు. పనీపాటా లేని ఆరోపణగా అభివర్ణించారు. గత ప్రభుత్వాలన్ని కూడా ప్రభుత్వ రంగ సంస్థ (CPSE)ల్లో పెట్టుబడులు ఉపసంహరించినవేనని, మోడీ ప్రభుత్వం దానికి స్పష్టమైన విధానాన్ని రచించి ఏవి వ్యూహాత్మకం, ఏవి వ్యూహాత్మకం కాదని వర్గీకరించిందన్నారు. వ్యూహాత్మకమైనవిగా వర్గీకరించిన రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేసే ప్రసక్తే లేదన్నారు.
రెండు PSUలు, బీమా కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళిక ప్రతిపక్ష ప్రభుత్వాల హయాంలో రూపొందించినదేనన్నారు. కుటుంబ ఆస్తిని పటిష్ఠం చేయాల్సిన అవసరముందని, చాలా PSUలు చిన్నవిగా ఉండడం వల్ల మనుగడ కష్టంగా ఉందని, పని చేస్తోన్న కొన్ని కూడా అందరినీ ఆకర్షించలేకపోతున్నాయన్నారు. అవసరమైన వాటి పరిధిని మరింతగా పెంచాలన్నారు. ఇదే తమ లక్ష్యమని చెప్పారు. భారత భవిష్యత్ ఆకాంక్షలు తీరాలంటే SBI వంటి పరిమాణం గల కనీసం 20 సంస్థలు అవసరమన్నారు.
కాగా, బ్యాంకుల ప్రయివేటైజేషన్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో కలిసి పని చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో బ్యాంకు ప్రయివేటీకరణ ప్రణాళికను ప్రకటించారు. తాజాగా ఇందుకు సంబంధించి ఆర్బీఐతో కలిసి పని చేస్తామని తెలిపారు.ఈ మేరకు నిర్మలమ్మ ముంబైలో విలేకరులతో మాట్లాడారు.