ఏజీఆర్ బకాయిలకు సంబంధించి టెలికం సంస్థలపై సుప్రీం కోర్టు తాజాగా బుధవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్ ఛార్జీల చెల్లింపుల విషయంలో ఎలాంటి పునఃసమీక్ష ఉండదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో స్వీయ మదింపు చేసుకున్న కంపెనీలపై కోర్టు మొట్టికాయలు వేసింది. అసలు వీటిని ఎవరు సమీక్షించమన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
బకాయిలు వసూలు చేయడంలో ప్రభుత్వం పనితీరుపై కూడా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జీలను పునఃసమీక్షించేందుకు గడువు ఇవ్వాలనే కేంద్రం వాదనను తోసిపుచ్చింది. కోర్టును ప్రభావితం చేసేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారని, కానీ అది అసాధ్యమని పేర్కొంది.
ఏజీఆర్ బకాయిలను పునఃసమీక్షించాలనే వాదనకు అంగీకరిస్తే కోర్టు గతంలో తప్పు చేసినట్లుగా అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది. బకాయిల చెల్లింపుల పునఃసమీక్షకు అనుమతించిన అదికారులను సహించేది లేదని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఏజీఆర్ చెల్లింపులపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని టెల్కోలు పలుమార్లు కోర్టును ఆశ్రయించాయి. అయితే గతంలో ఓసారి మొట్టికాయలు వేయటంతో కొన్ని చెల్లింపులు జరిపాయి. ఇప్పుడు కోర్టు పునఃసమీక్షిస్తే మిగతా మొత్తానికి మినయాంపు ఉంటుందని భావించాయి. కానీ కోర్టులో షాక్ తగిలింది.
ప్రభుత్వం ఏజీఆర్ బకాయిల చెల్లింపులను 20 ఏళ్ళ పాటు వాయిదాల రూపంలో చెల్లించేందుకు టెల్కోలకు అవకాశం కల్పిస్తూ విధివిధానాలను రూపొందించేందుకు అనుమతించాలని కేంద్రం సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఏజీఆర్ చెల్లింపుల వల్ల సంస్థ పని తీరు దెబ్బతింటుందని, ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని ప్రభుత్వం చెప్పింది. లక్షలాది మంది కస్టమర్లపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని కోర్టుకు తెలిపింది. దీనిపై సుప్రీం విచారణ జరపనుంది.


Click it and Unblock the Notifications