సెస్-సర్చార్జ్ వద్దు, ఆదాయపు పన్నుపై గార్గ్ కీలక సూచనలు: డివిడెండ్ ట్యాక్స్ కూడా వద్దు
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరగపోవచ్చునని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు. ఈ మేరకు ఆయన తన బ్లాగ్లో పన్ను వసూళ్లపై స్పందించారు. ఆర్థిక మందగమన ఈ ఏడాది పన్ను వసూళ్ల లక్ష్యాన్ని దెబ్బతీయనుందని అభిప్రాయపడ్డారు. వివిధ పన్నుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ.24.59 లక్షల కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రూ.2.5 లక్షల కోట్లు తగ్గే అవకాశం
ఈ లక్ష్యంలో రూ.2.5 లక్షల కోట్లకు గండిపడే ప్రమాదం ఉందన్నారు. పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ.2.5 లక్షల కోట్ల వరకు తగ్గుతాయిని, ఇది జీడీపీలో 1.2 శాతానికి సమానమని, వృద్ధి రేటును మళ్లీ పట్టాలు ఎక్కించేందుకు వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను సంస్కరించడంతో పాటు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ని పూర్తిగా రద్దు చేయాలని సూచించారు.
కేంద్రం వాటా అయితే మరింత ఎక్కువ తగ్గుదల
రెవెన్యూ తగ్గుదలకు సంబంధించి కేవలం కేంద్రం వాటానే పరిగణలోకి తీసుకుంటే అది మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ తగ్గుదల రూ.3.5 లక్షల కోట్ల నుంచి రూ.3.75 లక్షల కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
డివిడెండ్ తగ్గించాలి..
ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (DDT) రద్దు చేయాలని గార్గ్ సూచించారు. డిజిటల్ బ్యాంకింగ్ ప్రయోజనాల్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఇన్వెస్టర్లకు ఆయా సంస్థలు ఇచ్చే డివిడెండ్ పైన కేంద్రం వసూలు చేసే రేట్ 15 శాతంగా ఉంది. దీనిని తగ్గించాలని సూచించారు.
నాలుగు స్లాబ్స్ చాలు
ఆదాయపు పన్ను స్లాబ్స్ పైన కూడా గార్గ్ సూచనలు చేశారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్ల విధానాన్ని సరళతరం చేయాలన్నారు. సెస్ లేదా సర్ఛార్జ్ లేకుండా 4 స్లాబ్స్ ఉంటే చాలునని పేర్కొన్నారు.
ఎవరికి ఎంత ట్యాక్స్ ఉండాలంటే?
రూ.5 లక్షల ఆదాయం కలిగిన వారికి వార్షిక ఆదాయంపై పన్ను ఉండవద్దని గార్గ్ సూచించారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆధాయం కలిగిన వారికి 5 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల ఆదాయంపై 25 శాతం, రూ.50 లక్షలకు పైగా ఆదాయం ఉంటే వారిపై 35 శాతం పన్ను ఉండాలని సూచించారు.
ప్రస్తుతం ఇలా...
ప్రస్తుతం ఆదాయపు పన్ను స్లాబ్స్ ఎనిమిది ఉన్నాయి. ఇందులో అత్యధికం 40 శాతంగా ఉంది. వీటిని ఎనిమిది స్లాబ్స్కు కుదించాలని గార్గ్ సూచించారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కార్పోరేట్ ట్యాక్స్ను 22 శాతానికి తగ్గించారు. ఈ బడ్జెట్లో ఆదాయపు పన్ను ఊరట లభిస్తుందా లేదా అనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న.