ఏమిటీ అర్థంలేని వ్యవస్థ, ఒక్క పైసా చెల్లించరా: టెల్కోలపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
AGR ఛార్జీల కింద బకాయిపడిన వేలకోట్ల రూపాయలను ఇప్పటి వరకు చెల్లించనందుకు టెలికం సంస్థలపై భారత అత్యున్నత వ్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పాటించలేదని మండిపడింది. బకాయిలు చెల్లించనందుకు వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. అంతేకాదు, టెల్కోల నుండి డబ్బులు వసూలు చేయడంలో విఫలమైన ప్రభుత్వంపై కూడా కోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా ఎఫెక్ట్, భారీగా తగ్గిన చికెన్-గుడ్డు ధరలు: వీటిని తినవచ్చా.. ప్రభుత్వం మాట ఇదీ?
డైరెక్టర్లు కోర్టుకు హాజరు కావాలి
టెల్కోలు దాదాపు లక్షన్నర కోట్ల బకాయిలు చెల్లించకపోవడాన్ని సుప్రీమ్ కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలి కమ్యూనికేషన్స్ సంస్థలకు సమన్లు జారీ చేసింది. ఆయా కంపెనీలు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు పేర్కొంది. మార్చి 17న ఆ కంపెనీల డైరెక్టర్స్ కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించింది.
ఇలాంటి వ్యవస్థను ఎందుకు సృష్టిస్తున్నారో
ఇప్పటి వరకు AGRకు సంబంధించిన బాకీలు టెల్కోలు ఏమాత్రం చెల్లించలేదని జస్టిస్ మిశ్రా ఆగ్రహించారు. ఇంత అర్థంలేని వ్యవస్థను ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. చట్టానికి స్థానం లేదా అన్నారు. ఎన్నిసార్లు ఆదేశాలిచ్చినా టెల్కోలు చలించడం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా ఆగ్రహించారు. అబ్దుల్ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
డెస్క్ ఆఫీసర్పై ఆగ్రహం
కోర్టు తీర్పును ప్రభావితం చేసేలా ఆదేశాలు జారీ చేసినందుకు న్యాయస్థానం... ప్రభుత్వ టెలికం విభాగంలోని డెస్క్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నాన్సెన్స్ పనులు ఎవరు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదని, దేశంలో అసలు న్యాయం ఉందా, వారు దేశంలో జీవించడం కంటే విడిచి వెళ్లడం మేలేమో అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. AGR ఛార్జీలను వసూలు చేయడంలో సంస్థలపై ఒత్తిడి తేవొద్దని డెస్క్ ఆఫీసర్ అధికారులకు లేఖ రాసినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. అలాగే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. దీంతో సుప్రీం కోర్టు.. ఆఫీసర్పై మండిపడింది.
డబ్బు వసూలు చేయరాదని ఎలా చెబుతారు
టెల్కోల నుండి నుంచి డబ్బులు వసూలు చేయరాదని అధికారి ఎలా ఆదేశాలు ఇస్తారని సుప్రీం కోర్టు నిలదీసింది. సుప్రీం ఆదేశాల్ని ఓ డెస్క్ ఆఫీసర్ ఎలా అడ్డుకుంటారని అడిగింది. కాగా, 90 రోజుల్లో బకాయిలు చెల్లించాలని గత ఏడాది అక్టోబర్ నెలలో కోర్టు ఆదేశించింది. జనవరి 24న ఆదేశాలు ముగిశాయి. కానీ టెల్కోలు డబ్బులు చెల్లించలేదు. దీంతో సుప్రీం ఆగ్రహించింది.
నష్టపోయిన షేర్లు
టెల్కోలపై సుప్రీం కోర్టు ఆగ్రహం నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. వొడాపోన్ షేర్ 13.62 శాతం తగ్గి రూ.3.87 వద్ద, ఎయిర్టెల్ 3.54 శాతం తగ్గి రూ.558.9 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో వొడాఫోన్ ఐడియా షేరు 18 శాతం, ఎయిర్ టెల్ షేర్ 4 శాతం తగ్గింది.