కష్టకాలం ముగిసింది, యస్ బ్యాంకును కొనడం లేదు: ఎస్బీఐ చైర్మన్
ముంబై: ఎన్పీఏలతో వచ్చిన కష్టకాలం ముగిసిందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికానికి బ్యాంకు ఎన్పీఏలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయన్నారు. ప్రస్తుతం మూడో త్రైమాసికం నుంచి పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏవైనా దెబ్బలు ఎదురైతే ఎస్బీఐ తట్టుకోగలదన్నారు.
టెలికం రంగానికి భారీగా రుణాలు ఇచ్చి గతంలో చేతులు కాల్చుకున్న విషయం వాస్తవమే అన్నారు. కానీ ఇప్పుడు టెలికం రంగం పరిస్థితి మెరుగు పడుతోందన్నారు. పెద్ద ప్రాజెక్టుల రుణాలకు ప్రస్తుతం పెద్దగా డిమాండ్ లేదని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక మందగమనమే అందుకు కారణమన్నారు.
మోడీ కల నిజమైతే... ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు?
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ షేర్ల లిస్టింగ్ పైన కూడా ఆయన మాట్లాడారు. అప్పుడే ఈ షేర్ల లిస్టింగ్ ఉండరాదని, కంపెనీ విలువ కనీసం రూ.50 వేల కోట్లకు చేరుకున్న తర్వాత ఆ అంశంపై దృష్టి సారిస్తామన్నారు. దీనికి మరో మూడేళ్ళ సమయం పట్టవచ్చునని చెప్పారు. దాని కంటే ముందే ఎస్బీఐ అసెట్ మేనేజ్మెంట్ పబ్లిక్ ఇష్యూకి వస్తుందన్నారు.
ప్రయివేటు రంగ యస్ బ్యాంకుకు ఎస్బీఐ సహాయం చేస్తుందనే వార్తలు వచ్చాయి. దీనిపై కూడా ఆయన స్పందించారు. ఈ వార్తలను కొట్టి పారేశారు. యస్ బ్యాంకును ఎస్బీఐ కొనుగోలు చేయనున్నట్లు వచ్చే వార్తలు తప్పుడు వార్తలని, తాము కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ ప్రయివేటు బ్యాంకును కొనేందుకు తమ వద్ద తగిన నిధులు లేవన్నారు. యస్ బ్యాంకును కొనేందుకు కొటక్ మహీంద్రా బ్యాంకు సరైనదన్నారు. కొటక్ మహీంద్రాలో యస్ బ్యాంకు విలీనం వార్తలను కొటక్ బ్యాంకు మాత్రం కొట్టి పారేసింది.