ఆ విషయంలో హెచ్డీఎఫ్సీని వెనక్కి నెట్టిన ఎస్బీఐ: అక్కడా లీడింగ్
ముంబై: దేశీయ పబ్లిక్ సెక్టార్ సెగ్మెంట్లో లీడ్ బ్యాంక్గా కొనసాగుతున్న స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో మైలురాయిని అందుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ను భారీగా పెంచుకోగలిగింది. ఈ వారంలో వరుసగా మూడోరోజు కూడా భారతీయ స్టేట్బ్యాంక్ షేర్ల విలువ భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణమైంది. ఈ పరిణామం బ్యాంకింగ్ సెగ్మెంట్లో ఎస్బీఐ ఆధిపత్యాన్ని ప్రస్ఫూటింపజేసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లోనూ తిరుగులేదనిపించుకుంది.
బ్యాంకింగ్ షేర్లు..
ఆర్బీఐ శక్తికాంత దాస్ మానిటరి పాలసీ కమిటీ రివ్యూ వివరాలను ప్రకటించడానికి ముందే.. ఇవ్వాళ బ్యాంకింగ్ షేర్లు పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో బ్యాంకెక్స్.. ప్రారంభంలోనే 135 పాయింట్ల మేర లాభపడింది. 40,511 పాయింట్లకు పైగా ట్రేడ్ అయింది. బ్యాంకింగ్ నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది. 87 పాయింట్లతో లాభాలతో ట్రేడింగ్ ఆరంభమైంది. 35,082 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కనిపించింది. మొత్తంగా బ్యాంకింగ్ షేర్లు లాభపడ్డాయి.
వరుసగా మూడోరోజూ లాభాల్లో..
దీని ప్రభావం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లపై కనిపించింది. మంగళవారం సాయంత్రం క్లోజింగ్ ప్రైస్తో పోల్చుకుంటే మూడురూపాయల లాభంతో ఇవ్వాళ ఎస్బీఐ షేర్ల ట్రేడింగ్ ఆరంభమైంది. 466 రూపాయలతో ట్రేడింగ్ మొదలైంది. ఆ తరువాత స్వల్పంగా నష్టపోయినప్పటికీ.. మళ్లీ రికవరీ కాగలిగింది. ఒకదశలో గరిష్ఠంగా 474 రూపాయలను దాటింది. మధ్యాహ్నం ఎస్బీఐ షేర్లు 470 రూపాయలకు కాస్త అటు ఇటుగా ట్రేడింగ్ అవుతూ కనిపించాయి. రూ.6.50 పైసల లాభాన్ని ఇచ్చాయి.
ఎస్బీఐ ఎం క్యాప్
ఎస్బీఐ షేర్లు లాభాల బాట పట్టడం వరుసగా ఇది మూడోరోజు. సోమ, మంగళ వారాల్లోనూ అవి అప్పర్ సర్కుట్లో ట్రేడ్ అయ్యాయి. ఇప్పుడు కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఈ పరిణామాలు ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ను ఒక్కసారిగా పెంచాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మార్కెట్ క్యాప్ విలువ 4,21,757 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ మొత్తం ప్రైవేట్ లీడ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్డీఎఫ్సీ కంటే అధికం.
హెచ్డీఎఫ్సీ కంటే..
హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,11,757 కోట్ల రూపాయలు. కాగా- ఎస్బీఐ దీన్ని దాటేసింది. హెచ్డీఎఫ్సీ షేర్లపై విలీన ప్రక్రియ ప్రభావం పడినందు వల్లే కొంత వాల్యూ తగ్గిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. గత ఏడాది సరిగ్గా ఇదే రోజుతో పోల్చుకుని చూస్తే- హెచ్డీఎఫ్సీ షేర్ ధరలో 12 శాతం తగ్గుదల కనిపించడాన్ని దీన్ని ఉదహరిస్తోన్నాయి. ఈ విలీల ప్రక్రియకు ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, సీసీఐ, సెబి ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంది.
ఎన్బీఎఫ్సీ సెగ్మెంట్లో..
కాగా- మార్కెట్ క్యాపిటలైజేషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. దీని ఎం క్యాప్ 18 లక్షల కోట్ల రూపాయలు. 12 లక్షల కోట్ల రూపాయలతో రెండో స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిలిచింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సెగ్మెంట్ మార్కెట్ క్యాప్లో మాత్రం హెచ్డీఎఫ్సీ అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో బజాజ్ ఫైనాన్స్ నిలిచింది. దీని మార్కెట్ క్యాప్ 3,62,000 కోట్ల రూపాయలు.