ప్రత్యేక సంస్థగా ఎస్బీఐ డిజిటల్ యాప్ యోనో: భాగస్వాములతో చర్చిస్తున్నామన్న ఎస్బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తన డిజిటల్ ప్లాట్ఫామ్ యు ఓన్లీ నీడ్ వన్ (యోనో) యాప్ను ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చడానికి చురుకుగా ప్రయత్నిస్తోందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి చాలా గట్టిగా ఆలోచన జరుగుతోందని భాగస్వాములతో చర్చిస్తున్నామని దీనిని (యోనో) ప్రత్యేక అనుబంధ సంస్థగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నామని అని సొసైటీ ఫర్ వరల్డ్వైడ్ ఇంటర్బ్యాంక్ ఫైనాన్షియల్ నిర్వహించిన సిబోస్ 2020 అనే బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ కమ్యూనికేషన్స్ సమావేశంలో రజనీష్ కుమార్ చెప్పారు.
యోనో పై భాగస్వాములతో చర్చలు జరుగుతున్నాయన్న రజనీష్ కుమార్
చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, యోనో వాల్యుయేషన్ కూడా ఇంతవరకు జరగలేదని ఆయన అన్నారు. ఇటీవల, ఎస్బిఐ చైర్మన్ యోనో డిజిటల్ ప్లాట్ ఫామ్ లాభదాయక వేదిక అని, 40 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు . విషయం ఏమిటంటే, అది బ్యాంకులో అంతర్భాగం అయినందువలన అది లెక్కలలో ప్రతిబింబించదు. అది బ్యాంకులలో అంతర్భాగం కాకుంటే, దానికి వాల్యుయేషన్ ఉంటుంది. యోనోకు ఉన్న మార్కెట్ విలువ 40-50 బిలియన్ డాలర్లు కావచ్చు అని రజనీష్ కుమార్ వెల్లడించారు .
యోనో ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చటానికి ప్రయత్నాలు
ఎస్బిఐ తన వినియోగదారుల బ్యాంకింగ్, పెట్టుబడి మరియు షాపింగ్ అవసరాలకు సహాయపడటానికి 2017 నవంబర్లో యోనో ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. యోనో 27 మిలియన్లకు పైగా నమోదిత వినియోగదారులతో 56 మిలియన్లకు పైగా డౌన్లోడ్లతో కస్టమర్లకు సేవలు అందిస్తుంది . యోనో 20 కి పైగా విభాగాలలో 80 కి పైగా ఇ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది . యుకె మరియు మారిషస్ వంటి ప్రపంచ మార్కెట్లలోకి కూడా యోనో ప్రవేశించింది.
నిన్న రాత్రి కొత్త చైర్మన్ గా దినేశ్ కుమార్ ఖారా నియామకం
ఇక యోనో ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రజనీష్ కుమార్ సదస్సులో చెప్పినప్పుడు ఆయన ఎస్బీఐ చైర్మన్ గా ఉన్నారు. నిన్నటితో ఆయన పదవీకాలం పూర్తయ్యింది . దీంతో ఎస్బీఐ చైర్మన్ గా తాజాగా దినేశ్ కుమార్ ఖారా నియమితులయ్యారు. మూడేళ్ల కాలం పాటు ఆయనను ఎస్బీఐ సారథిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. నేడు ఆయన రజనీష్ కుమార్ స్థానంలో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు . ఆయన ఇంత కాలం ఎస్బీఐ లో మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు . 1984నుండి ఎస్బీఐ లో ప్రొబేషనరీ ఆఫీసర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఖారా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా మూడేళ్ళపాటు ఎస్బీఐ చైర్మన్ గా కొనసాగనున్నారు.