జీరో బ్యాలెన్స్ అకౌంట్స్పై ఛార్జీల రూపంలో రూ.300 కోట్లు వసూలు చేసిన ఎస్బీఐ
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా వివిధ బ్యాంకులు వివిధ సేవల పైన ఛార్జీలు వసూలు చేస్తాయి. ఉదాహరణకు అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకుంటే ఫైన్ ఉంటుంది. ఇలా ఛార్జీల రూపంలో SBI గత అయిదేళ్ళ కాలంలో భారీగా వసూలు చేసింది. 5 సంవత్సరాలలో కేవలం జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై ఛార్జీల రూపంలోనే SBI రూ.300 కోట్లు వసూలు చేసింది. జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్స్ (BSBDA) ఖాతాదారులకు అందించే కొన్ని సేవలపై అధిక ఛార్జీలు విధిస్తున్నట్లు ఐఐటీ బొంబాయి అధ్యయనంలో తేలింది.
... దాటితే రూ.17.70 వసూలు
SBI గరిష్ట సంఖ్యలో BSBDAలను నిర్వహిస్తోంది. ప్రతి డెబిట్ ట్రాన్సాక్షన్ పైన నెలకు నాలుగు దాటిన ప్రతిసారి రూ.17.70 ఛార్జ్ చేస్తోంది. ఇందులో డిజిటల్ మార్గాలు కూడా ఉన్నాయి. 2018-19 కాలంలో రూ.72 కోట్లు వసూలు చేయగా, 2019-20 రూ.158 కోట్లు వసులు చేసినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. 2013 సెప్టెంబర్ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం BSBDAపై ఛార్జీలు వసూలు చేస్తారు.
PNB రూ.9.9 కోట్లు వసూలు
12 కోట్ల BSBDAల నుండి ఎస్బీఐ అయిదేళ్ల కాలంలో రూ.300 కోట్ల మొత్తాన్ని ఛార్జీల రూపంలో వసూలు చేసింది. అంటే 2015 నుండి 2020 మధ్య కాలంలో ఈ మొత్తం వసూలు చేసింది. 2018-19 కాలంలో రూ.72 కోట్లు, 2019-20లో రూ.158 కోట్లు వసూలు చేసింది. ఇక, రెండో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) ఇదే కాలంలో 3.9 కోట్లు BSBD ఖాతాదారుల నుండి రూ.9.9 కోట్లు వసూలు చేసింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే
SBI 2013 నుండి ఆర్బీఐ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ నెలకు నాలుగు దాటిన ప్రతి డెబిట్ ట్రాన్సాక్షన్ పైన BSBDA హోల్డర్ల నుండి అధిక చార్జీలు వసూలు చేస్తుంది. నెఫ్ట్, IMPS వంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన కూడా ఛార్జీలు రూ.17.70 వసూలు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఓ వైపు ప్రభుత్వం దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తుంటే మరోవైపు, SBI ఖాతాదారులకు షాకిస్తోందని అంటున్నారు.