SBI Card IPO: మార్కెట్లపై కరోనా ఉప్పెన, ఎస్బీఐ కార్డ్స్ లిస్టింగ్పై టెన్షన్
సాధారణంగా ఆర్థిక మందగమనం, మార్కెట్లు నష్టాల్లో ఉన్న సందర్భాల్లో ఏ కంపెనీ కూడా లిస్టింగ్ కోసం ముందుకు రాదు. కానీ ఓ వైపు మందగమనం నుండి కోలుకోకుండానే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారత్, అగ్రదేశాలు సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ఈ దెబ్బకు భారత మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్బీఐ కార్డ్స్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానుంది.
కరోనా దెబ్బ, బ్యాంకుల కీలక నిర్ణయం, ఆఫీస్లలో ఉద్యోగుల తగ్గింపు!
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్పై సర్వత్రా ఆసక్తి
ఎస్బీఐ కార్డ్స్ ఫైనల్ ఐపీవో రూ.755గా స్టాక్ ఎక్స్చేంజీలో నమోదు కానుంది. క్రెడిట్ కార్డ్స్ మార్కెట్లో ఇది రెండో పెద్దకంపెనీగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇష్యూకి 26 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఈ క్యాలెండర్ ఇయర్లో తొలిసారి లిస్ట్ అవుతోంది ఎస్బీఐ కార్డ్స్.
తొలుత రూ.350కి సై..
ఎస్బీఐ కార్డ్స్కు ఈ నెల మొదటి వారం వరకు ఇష్యూకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత పరిస్థితులు కాస్త తారుమారైనట్లుగా భావిస్తున్నారు. ఓ దశలో గ్రే మార్కెట్లో రూ.350 నుండి రూ.380 అధికంగా చెల్లించేందుకు ముందుకు వచ్చారని, ఇప్పుడు ఇష్యూకి గ్రే మార్కెట్లో ప్రీమియం రూ.25 నుండి రూ.50 మధ్య ఉందని చెబుతున్నారు.
కరోనా ప్రభావం ఉందా..
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో గ్రే మార్కెట్లో ఎస్బీఐ కార్డ్స్ ఇష్యూ డిస్కౌంట్లోకి ప్రవేశించిందనేది నిపుణుల మాట. ఎంప్లాయీస్ ఫైనల్ ధరపై రూ.75 డిస్కౌంట్తో ఈ షేర్ను అందుకున్నారు. ఎస్బీఐ కార్డ్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.10,340 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.
అదే నష్టాలు ఉంటే..
గత వారంలో సోమ, గురువారం మార్కెట్లు భారీ నష్టాల్ని మూటకట్టుకున్నాయి. శుక్రవారం కూడా ఆరంభంలో సెన్సెక్స్ 3000 పాయింట్లు, నిఫ్టీ 900కు పైగా పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆ తర్వాత కాస్త కోలుకుంది. సాయంత్రానికి లాభాల్లో ముగిసినప్పటికీ.. గత వారం మొత్తం చూసుకుంటే మార్కెట్లు భారీ నష్టాల్లోనే ముగిశాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్స్ అధిక శాతం నష్టాలతో లిస్టయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మార్కెట్లు జోరుగా ఉంటే మాత్రం కొంతమేర ప్రీమియం ధరలో లిస్ట్ కావొచ్చని భావిస్తున్నారు.
HNIల ఆందోళన
ఎస్బీఐ కార్డ్స్ ఇన్వెస్టర్లను బాగానే ఆకట్టుకుంది. కానీ కరోనాతో మార్కెట్లు కూలిపోతుండటంతో HNIలు సగటున 13 శాతం నుండి 15 శాతం వడ్డీ రేటులో రుణాల ద్వారా సబ్స్క్రైబ్ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీవో ధర దగ్గరలోనే లిస్ట్ అయితే HNIలకు నష్టాలు ఎదురు కావొచ్చునని అంటున్నారు. ఇటీవల గ్రే మార్కెట్లో రూ.10 నుండి రూ.25 డిస్కౌంట్ పలికినట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాత రూ.5కు చేరిందని తెలియడం కొంతలో కొంత ఊరట. రిటైల్ విభాగంలో 2.5 రెట్లు అధిక దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటిలోను ఇన్వెస్టర్లు ఎక్కువ సంఖ్యలో అలాట్మెంట్ పొందారట.