పెరిగిన SBI కార్డ్ ఎన్పీఏలు, కస్టమర్లు చేసిన ఖర్చు 10% డౌన్
ప్రభుత్వరంగ SBI క్రెడిట్ కార్డ్ విభాగం ఎస్బీఐ కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ మొత్తం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్(NPA) సెప్టెంబర్ 30వ తేదీ నాటికి 4.3 శాతానికి పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో 2.3 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో ఎస్బీఐ కార్డ్ రూ.206 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో నమోదు చేసిన నికర లాభం రూ.381 కోట్లతో పోలిస్తే 46 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.2,376 కోట్ల నుండి ఆరు శాతం పెరిగి రూ.2,513 కోట్లుగా నమోదయింది.
రెండింతలు పెరిగిన సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు, ఎందుకంటే? బ్రిటన్లోను అదే పరిస్థితి
పెరిగిన నిరర్థక ఆస్తులు
ఎస్బీఐ కార్డ్ సంస్థలో 2020-21 రెండో క్వార్టర్ నాటికి 1.1 కోట్ల క్రెడిట్ కార్డులు మనుగడలో ఉన్నాయి. ఏడాది క్రితం 95 లక్షల క్రెడిట్ కార్డులు ఉండగా, ఈసారి 16 శాతం పెరిగాయి. అయితే వీటి ద్వారా కస్టమర్లు చేసిన ఖర్చు మాత్రం 10.8 శాతం తగ్గింది. గత ఏడాది రూ.33,176 కోట్లు వ్యయం ఉండగా, ఈసారి రూ.29,590 కోట్లుగా ఉంది. కంపెనీ వడ్డీ ఆదాయం రూ.1,162 కోట్ల నుండి 9.7 శాతం పెరిగి రూ.1275 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే స్థూల నిరర్థక ఆస్తులు 2.3 శాతం నుండి 4.3 శాతానికి పెరిగాయి.
వేతనజీవులే ఎక్కువ
ఎస్బీఐ కార్డ్ కస్టమర్లలో 84 శాతం మంది వేతనజీవులు. ఇందులో 38 శాతం మంది పబ్లిక్ సెక్టార్, 24 శాతం మంది పెద్ద కార్పోరేట్ సెక్టార్లో ఉన్నారు. ఎస్బీఐ కార్డ్ ఫలితాల నేపథ్యంలో ఈ రోజు ఈ స్టాక్ 5.51 శాతం క్షీణించి రూ.805 వద్ద ముగిసింది. ఎస్బీఐ కార్డ్ మొత్తం స్థూల రుణాలు రూ.23,038 కోట్ల నుండి స్వల్పంగా పెరిగి రూ.23,978 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ బ్యాలెన్స్ షీట్ రూ.24,313 ోట్లు ఉండగా, నికర వ్యాల్యూ రూ.5,949 కోట్లుగా ఉంది.
98 శాతం కరోనా ముందుస్థాయికి
రోజువారీ కొత్త కార్డుల జారీ కరోనా ముందున్న పరిస్థితులకు సమీపంలో 98 శాతంగా ఉన్నట్లు ఎస్బీఐ కార్డ్ తెలిపింది. రిటైల్ వ్యయాలు క్వార్టర్ ప్రాతిపదికన 50 శాతం పెరిగాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి నుండి ఆర్థిక కార్యకలాపాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రంగాలపై, కంపెనీలపైప్రభావం పడింది.