దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లు సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్న సమయంలో ఆన్లైన్ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు చాలా వరకు నగదు లావాదేవీలకు బదులుగా, ఆన్లైన్ లావాదేవీలను చేస్తున్నారు. దీంతో డిజిటల్ చెల్లింపులు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

సురక్షితమైన బ్యాంకింగ్ పద్ధతుల కోసం ఎస్బిఐ కస్టమర్లకు హెచ్చరిక
ఏదేమైనా, ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ లావాదేవీలు చేసేవారు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించకపోతే బ్యాంకుల్లో ఉన్న నగదు సైబర్ నేరగాళ్ల దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది. ఆన్లైన్ లావాదేవీలకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడంతో, ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన మోసాలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ, సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు సురక్షితమైన బ్యాంకింగ్ పద్ధతుల కోసం తన కస్టమర్ లకు హెచ్చరికలు, ట్యుటోరియల్స్ మరియు సమాచారాన్ని విడుదల చేస్తుంది.

క్యూఆర్ కోడ్లు స్కాన్ చెయ్యొద్దని వార్నింగ్ .. సైబర్ నేరాలపై అలెర్ట్
ఇటీవల, ఎస్బిఐ క్యూఆర్ స్కాన్లకు సంబంధించి హెచ్చరికను జారీ చేసింది.ఈ స్కామ్ ల బారిన కస్టమర్లు పడకుండా ఉండటానికి ఎస్బిఐ తన వినియోగదారులను ఎప్పుడూ క్యూఆర్ కోడ్ను స్కాన్ చెయ్యొద్దని విజ్ఞప్తి చేసింది. మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినప్పుడు మీకు డబ్బు రాకపోగా మీ బ్యాంక్ ఖాతా నుండి సదరు సైబర్ నేరగాడికి మీ ఖాతాలోని నగదు చేరిపోతుంది .అందుకే క్యూఆర్ కోడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని , ఎవరైనా పంచుకున్న #QR కోడ్లను స్కాన్ చేయవద్దని ఎస్బిఐ ట్వీట్ చేసింది.

వీడియో షేర్ చేసి మరీ ఎస్బిఐ వివరణ .. కస్టమర్ల కోసం ఎస్బిఐ ట్వీట్
క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం వల్ల మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందనే విషయాన్ని వివరించే వీడియోను కూడా ఎస్బిఐ పంచుకుంది. ఇటీవల కాలంలో బ్యాంకింగ్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఎస్బిఐ తన కస్టమర్లు సైబర్ నేరగాళ్ల బారినపడకుండా ఎప్పటికప్పుడు కీలక అలెర్ట్ లను ఇస్తుంది . సోషల్ మీడియా వేదికగా ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అన్న విషయాలను కస్టమర్లకు అర్థమయ్యేలా వీడియోలు పెట్టి మరీ తెలియజేస్తుంది.


Click it and Unblock the Notifications