Samsung Jobs: 1000 మంది ఇంజనీర్ల రిక్రూట్ మెంట్.. జాబ్ కావాలా టెక్కీలు..
Samsung Jobs: దేశంలో అతిపెద్ద కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ గా ఉన్న సామ్సంగ్ కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటోంది. బెంగళూరు, నోయిడాల్లో Samsung R&D ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేస్తోంది. దీనికోసం దాదాపు 1000 మంది యువ ఇంజనీర్లను నియమించుకోవాలని యోచిస్తోంది.
2023లో ఉద్యోగం..
కంపెనీలో చేరే ఈ యువ టెక్కీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, IoT, కనెక్టివిటీ, క్లౌడ్, బిగ్ డేటా, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనాలిసిస్, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, సిస్టమ్ ఆన్ ఎ చిప్(SoC) సాంకేతికతలపై పనిచేస్తారని కంపెనీ చెబుతోంది. కంపెనీ తన అవసరాల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ నెట్వర్క్ల వంటి వివిధ రంగాలకు చెందిన ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటోంది.
సామ్సంగ్ HR మాట్లాడుతూ..
కంపెనీ ఇన్నోవేషన్, అత్యాధునిక సాంకేతికతపై భారీగా దృష్టి సారించిందని సామ్సంగ్ హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ సమీర్ వాధావన్ అన్నారు. ఇందుకోసం సామ్సంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు దేశంలోని టాప్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ల నుంచి తాజా టాలెంట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఈ క్రమంలో కంపెనీ మద్రాస్, దిల్లీ, హైదరాబాద్, ముంబై, రూర్కీ, ఖరగ్పూర్,కాన్పూర్, గువహటి ఐఐటీలతో పాటు బిట్స్ పిలానీల నుంచి 200 మంది ఇంజనీర్లను నియమించుకుంటోంది. దీనికి తోడు ఇతర అగ్రశ్రేణి సంస్థల నుంచి 400 ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లను(PPO) అందించింది.
సామ్సంగ్ పేటెంట్స్..
మనదేశంలోని సామ్సంగ్ రీసెర్చ్ సెంటర్లు మల్టీ-కెమెరా సొల్యూషన్స్, టెలివిజన్, డిజిటల్ అప్లికేషన్లు, 5G, 6G, అల్ట్రా-వైడ్బ్యాండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ వంటి రంగాల్లో 7,500 పేటెంట్లను దాఖలు చేశాయి. వీటిలో చాలా వరకు సామ్సంగ్ ఫ్లాగ్షిప్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, నెట్వర్క్ పరికరాల్లో వాణిజ్యపరంగా కంపెనీ వినియోగిస్తోంది. దీనితో R&D సెంటర్ మేడ్ ఇన్ ఇండియా ఆవిష్కరణలకు భారతదేశపు నంబర్ వన్ పేటెంట్ ఫైలర్గా అవతరించింది.
ప్రస్తుతం దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా టెక్కీలు ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న తరుణంలో కొరియన్ కంపెనీ సామ్సంగ్ మాత్రం కొత్త ఆవిష్కరణల సృష్టిలో భాగంగా నవతరం టెక్కీలను నియమించుకుంటోంది.