ఇబ్బందులున్నా ఈ కంపెనీలో ఉద్యోగుల తొలగింత లేదు, ప్రమోషన్లు, శాలరీ హైక్
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగాల కోత లేదా వేతనాల కోతకు మొగ్గు చూపాయి. కొన్ని కంపెనీలు మాత్రం వేతనాలు పెంచుతున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోను వేతనాలు పెంచుతున్న సంస్థల్లో సహారా గ్రూప్ కూడా ఉంది. తమ కంపెనీలో ఇప్పుడు ఎలాంటి ఉద్యోగాల కోత లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఉద్యోగులకు వేతనాల పెంపు, ప్రమోషన్స్ ఉన్నట్లు తెలిపింది.
డి-మార్ట్ రాధాకిషన్ ధమానీ 'టేకోవర్' ఎఫెక్ట్, దూసుకెళ్లిన ఇండియా సిమెంట్స్ షేర్లు
వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ ఉద్యోగాల తొలగింత లేదు
కరోనా సంక్షోభంలోనూ ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నామని, ప్రమోషన్స్ ఇస్తున్నామని సహారా గ్రూప్ రెండు రోజుల క్రితం తెలిపింది. తమ సంస్థల్లో ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని తెలిపింది. కరోనా ప్రభావంతో వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్కు తిరిగి వెళ్లిన వలస కార్మికులకు ఉపాధిని కూడా కల్పించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. లాక్ డౌన్తో వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అయినప్పటికీ ఉద్యోగుల తొలగింపు లేదని స్పష్టం చేసింది.
ప్రమోషన్.. వేతన పెంపు
తమ సంస్థలో ఉద్యోగులు అందరూ పూర్తి భద్రతతో విధుల్లో కొనసాగుతారని తెలిపింది. క్షేత్రస్థాయిలో పని చేసే 4,05,874 ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చినట్లు తెలిపింది. అంతేకాకుండా 4,808 మంది కార్యాలయ ఉద్యోగులకు ప్రమోషన్తో పాటు శాలరీ ఇంక్రిమెంట్ ఇచ్చామని వెల్లడించింది. తమ వద్ద పని చేసే ఉద్యోగుల జీవనోపాధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సహారా గ్రూప్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వ్యాపార సంస్థలకు విజ్ఞప్తి చేసింది. నిస్సందేహంగా ఇది చాలా క్లిష్టమైన సమయమని, అయినప్పటికీ ఉద్యోగుల సంరక్షకులుగా, అలాగే ఉద్యోగుల కుటుంబాల జీవనోపాధికి ఇబ్బంది రాకుండా చూడటం మన బాధ్యత అని తెలిపింది.
వారి అర్హతలను బట్టి ఉపాధి
కరోనా కారణంగా పలు రాష్ట్రాల నుండి వలస కూలీలు యూపీకి తిరిగి వెళ్లారని, ఆయా ప్రాంతాల్లో స్థానికులకు వారి అర్హతలను బట్టి తమ గ్రూపు సంస్థల్లో ఉపాధి కల్పిస్తామని పేర్కొనడం గమనార్హం. సహారా గ్రూప్లో 14 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటించాలని సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ గతంలోనే సూచించారు.