ఈసారి పతనం.. వచ్చేసారి జూమ్: భారత వృద్ధిపై ఎస్&పీ అంచనా
2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 9 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని గ్లోబల్ రేటింగ్ ఎస్ అండ్ పీ అంచనా వేసింది. కరోనా మహమ్మారి కారణంగా భారత, ప్రపంచ వృద్ధిరేటు దారుణంగా క్షీణిస్తుందని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. భారత జీడీపీ మైనస్ 9 శాతం నుండి మైనస్ 14 శాతం మేరకు పడిపోతుందని ఇతర సంస్థలు ఇదివరకే అంచనా వేశాయి. అంతేకాదు, ఈ రేటింగ్ ఏజెన్సీ భారత లాంగ్ టర్మ్ ఫారెన్, లోకలన్ కరెన్సీ సావరీన్ క్రెడిట్ రేటింగ్ను BBB-వద్ద స్థిరంగా ఉంచింది. షార్ట్ టర్మ్ రేటింగ్ A-3గా కొనసాగుంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో -9గా ఉండనున్న జీడీపీ వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో మాత్రం భారీగా పుంజుకుంటుందని పేర్కొంది.
ఈసారి -9%, వచ్చేసారి 10 శాతానికి జూమ్
FY22 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 10 శాతానికి ఎగిసిపడుతుందని ఎస్ అండ్ పీ అంచనా వేసింది. పెట్టుబడులపై దృష్టి సారించడం, ఉద్యోగాలను పెంచే విధంగా ప్రభుత్వం తీసుకునే కీలకసంస్కరణలు రికవరీకి ఉపయుక్తంగా ఉంటాయని తెలిపింది. పెట్టుబడులు, ఉద్యోగాలు రికవరీకి కీలక అంశాలు అని తెలిపింది. కరోనా మహమ్మారి, ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అనివార్యంగా మారిన లాక్ డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని తెలిపింది. దీనికి తోడు మహమ్మారికి ముందు ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని ఎస్ అండ్ పీ రేటింగ్ ఏజెన్సీ గుర్తు చేసింది.
ఉద్దీపన అవసరం..
భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. మే నెలలో కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లకు పైగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని, కానీ జీడీపీలో తక్కువ అని పేర్కొంది. భారత ప్రభుత్వం అదనపు ఉద్దీపన ప్రకటిస్తే ఈ సంవత్సరం జీడీపీ తిరోగమనాన్ని తగ్గించవచ్చునని తెలిపింది. అవసరమైనప్పుడు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోందని, కానీ భారీ ప్యాకేజీ మాత్రం రావడం లేదని తెలిపింది. ప్రభుత్వంపై కూడా రుణభారం పెరుగుతున్న అంశాన్ని ప్రస్తావించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రుణ లక్ష్యాన్ని రూ.7.8 లక్షల కోట్ల నుండి రూ.12 లక్షల కోట్లకు పెంచిందని గుర్తు చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీలో ఆర్థిక లోటు 12.5 శాతం వద్ద, ప్రభుత్వ రుణంలో 90 శాతం వద్ద ఉంటుందని తెలిపింది.
జీడీపీలో 1.2 శాతం..
కేంద్రం ఉద్దీపన ద్వారా ఇప్పటి వరకు ఇచ్చింది జీడీపీలో 1.2 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సగటు జీడీపీలో 3 శాతంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, పార్లమెంటులో ప్రభుత్వానికి ఉన్న అధిక మెజార్టీ కీలక సంస్కరణలు వేగవంతం చేసేందుకు ఉపయోగపడుతుందని ఎస్ అండ్ పీ తెలిపింది. దేశంలో ఉపాధి పద్ధతులను సరళీకరించేందుకు సహాయపడే మూడు కార్మిక సంస్కరణ బిల్లులకు కేంద్రం ఆమోదం తెలిపిందని గుర్తు చేసింది. ముఖ్యంగా 300 కంటే తక్కువ మంది కార్మికులు ఉంటే సంస్థలకు మే 2020లో ప్రకటించిన అదనపు సంస్కరణలు, రక్షణలో విదేశీ పెట్టుబడుల పెంపు, దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ల సరళీకరణ, వాణిజ్య మైనింగ్ పైన ఆంక్షల సడలింపు వంటివి దీర్ఘకాలంలో ఉత్పాదకతను పెంచేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడింది.