కరోనా: భారత వృద్ధిరేటు తగ్గించిన ఏజెన్సీలు, చైనా వృద్ధి దాదాపు 40% ఫట్
కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో మెరుగు. కరోనా కట్టడిలో మన భేష్ అని అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రశంసించాయి. అయినప్పటికీ చైనా సహా వివిధ దేశాలపై దిగుమతులు, ఎగుమతులతో పాటు కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలు బారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనున్నాయి.
కరోనా వల్ల ఆర్థిక మాంద్యంలోకి, ఆగస్ట్ వరకు సంక్షోభం: ట్రంప్
వృద్ధి రేటు తగ్గించిన ఎస్ అండ్ పీ
కరోనా వైరస్ కారణంగా 2019-20 ఆర్థిక సంత్సరంలో భారత వృద్ధి రేటును స్టాండర్డ్ అండ్ పూర్స్ (S&P) తగ్గించింది. ఇదివరకు 5.7 శాతంగా అంచనా వేయగా, ఇప్పుడు దానిని 5.2 శాతానికి తగ్గించింది. కరోనా వైరస్ కారణంగా ఆసియా పసిఫిక్ దేశాలు మాంద్యంలోకి వెళ్లవచ్చుననే ఆందోళనలు వెలువడుతున్న నేపథ్యంలో ఎస్ అండ్ పీ వృద్ధి రేటు అంచనాలో కోత విధించింది. చైనా వృద్ధి రేటును కూడా 4.8 శాతం నుండి 2.9 శాతానికి తగ్గించింది.
మూడీస్, OECD కూడా..
మూడీస్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) కూడా వృద్ధి రేటు అంచనాలు తగ్గించాయి. మూడిస్ 5.3 శాతానికి OECD 5.1 శాతానికి తగ్గించింది. మూడీస్ గత నెలలోవృద్ధి అంచనాను 5.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. నెల రోజులు గడవకముందే కోత విధించింది. తొలుత 6.6 శాతంగా అంచనా వేసింది. ఆ తర్వాత వరుసగా తగ్గిస్తూ వస్తోంది.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావమని మూడీస్
2018లో 7.4 శాతంగా నమోదైన వృద్ధి, 2019లో 5.3 శాతంగా అంచనా వేయగా 2020లోను అంతేస్థాయిలో ఉంటుందని పేర్కొంది. చైనాతో పాటు ప్రంపచ దేశాలను కోరనా వణికిస్తోంది. భారత్లో ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోందని దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్ పేర్కొంది.
2021లో కోలుకుంటుంది
ముఖ్యంగా వినిమయ డిమాండ్ భారీగా పడిపోతోందని, మరోవైపు సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. కానీ, 2021లో మాత్రం భారత్ తిరిగి కోలుకొని 5.8 శాతం వృద్ధిని సాధిస్తుందని మూడీస్ పేర్కొంది. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి పలు ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీలు, కీలక చర్యలు తీసుకుంటున్నాయని, ముఖ్యంగా వడ్డీరేట్లను సైతం తగ్గిస్తున్నాయని మూడీస్ పేర్కొంది.