కరోనా ఎఫెక్ట్: ముందున్నది రోబోట్ల కాలం!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు భవిష్యత్ పై ఆందోళన నెలకొంది. కానీ, ప్రతీ సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి, కరోనా కు కూడా ఒక పరిష్కారం లభిస్తుందని ఆశావహులు ఉత్సాహం నింపుతున్నారు. కొందరైతే ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి కరోనా సంక్షోభావాన్ని ఒక సవాలుగా స్వీకరించి, దానిని ఒక మంచి అవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా... ఒక రంగం మాత్రం కరోనా కు విరుగుడుగా కనిపిస్తోంది. అదే రోబోటిక్స్. అవును. ఇకముందు మనుషులు చేసే దాదాపు అన్ని పనులూ రొబొట్లే చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. సామజిక దూరం పాటించటం, శానిటైజ్ చేసుకోవటం, మాస్కులు ధరించటం వంటి ఎన్ని రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నా... ఇప్పటికీ కరోనా వైరస్ భయాలు వీడటం లేదు. అందుకే, ఒక మనిషిని మరో మనిషి నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి, ఇలాంటి సమయంలో రోబోట్ లు బెటర్ అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రోబోలకు ఉండే ప్రత్యేక ఏర్పాట్లు అవి కరోనా వంటి భయంకర వైరస్ ల బారిన పడకుండా చూసుకోవటంతో పాటు మనుషులను కూడా రక్షించగలిగే సామర్థ్యం ఉండటం కలిసొచ్చే అంశం.
వాటిని ఆపకుంటే కష్టం: ఆర్థిక వ్యవస్థపై గౌతమ్ అదానీ హెచ్చరిక
హోటల్స్ నుంచి బార్ల వరకు...
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత .. ఇండియా లో హోటల్స్ రంగం బాగా దెబ్బతింది. లాక్ డౌన్ లో దాదాపు పూర్తిగా మూసివేయాల్సి రాగా.. ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత హోటల్స్ తెరుచుకున్నాయి. కానీ అతిథుల సంఖ్య మాత్రం నానాటికీ తీసికట్టుగా ఉంటోంది. కేవలం పార్సెల్స్ వరకు మాత్రం ఫరవా లేదు. కానీ హోటల్స్ కు వచ్చి కూర్చొని తినే వారు తగ్గిపోయారు. దీనికి ఒకటే కారణం. హోటల్స్ లో సర్వర్ల నుంచి బిల్లింగ్ సెక్షన్ వరకు చాలా మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. అక్కడి పరిసరాల శుభ్రత తో పాటు హోటల్ కు వెళితే ఎక్కువ మంది తో కాంటాక్ట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే అంత మందిలో ఎవరికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తెలియదు. అందుకే, అదొక పెద్ద రిస్క్ అని వినియోగదారులు వెనుకాడుతున్నారు. కానీ, మున్ముందు హోటల్స్ సెర్వర్ల కు బదులు పూర్తిగా రోబోలు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బిల్లింగ్ సెక్షన్ లో కూడా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక బార్ల లో కూడా వైన్ మిక్సింగ్ నుంచి మందు సర్వ్ చేసేంత వరకు అన్నిటికి రోబోలను వినియోగించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
సెక్యూరిటీ కి కూడా అవే ...
ప్రపంచం ఎంత అభివృద్ధి సాధించినా... నానాటికీ సెక్యూరిటీ భయాలు పెరిగిపోతున్నాయి. సొంత ఇంటి నుంచి మొదలు పెడితే... ఎయిర్ పోర్టుల వరకు అన్ని ప్రదేశాల్లో సెక్యూరిటీ కోసం చాలా వ్యయం చేయాల్సి వస్తోంది. ఇందుకోసం ఇప్పటి వరకు అధికంగా మనుషుల అవసరం ఉంటోంది. కానీ, ఈ విభాగంలో పెద్ద ఎత్తున రోబోట్ల ను వినియోగించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మనుషులతో పోల్చితే కనీసం 100 రెట్లు అధిక సమర్థవంతంగా పనిచేయగలిగే సామర్థ్యం సొంత మవుతుంది. కచ్చితత్వానికి గారెంటీ లభిస్తుంది. అయితే రోబోలు మనుషుల వలె ఆలోచించ లేవు కాబట్టి, వాటితో కొన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా లేకపోలేదు. కానీ, ప్రయోజనాలతో పోల్చితే ముప్పు తక్కువగా ఉంటే... తప్పనిసరిగా ప్రజలు, ప్రభుత్వాలు రోబోట్ల వినియోగానికి పెద్దగా విముఖత చూపకపోవచ్చు. అదే జరిగితే త్వరలోనే ఇండియా లో పెనుమార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి.
50 బిలియన్ డాలర్ల మార్కెట్...
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సర్వీస్ విభాగంలో పనిచేసే రోబోట్ల సంఖ్య తక్కువగానే ఉందని చెప్పాలి. కానే పరిశ్రమల్లో వీటిని అధికంగా వినియోగిస్తున్నారు. కానీ కరోనా వైరస్ ను ప్రజలకు రక్షణ కల్పించాలంటే ప్రతి సేవలో వీలైనంత ఎక్కువ మానవ ప్రమేయాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అందుకే అక్కడ రోబోట్ల వినియోగం జరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సర్వీస్ విభాగంలో ఉన్న రోబోట్ల విలువ సుమారు 15 బిలియన్ డాలర్లు గా ఉంది. కానీ అది వచ్చే ఐదేళ్లలోనే సుమారు 50 బిలియన్ డాలర్ల కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. కరోనా పుణ్యమా అని అది మరింత వేగంగా కూడా జరగొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మన దేశం, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా కొన్ని రోబోటిక్ సంస్థలు తమ సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు అవి మరింత ఎక్కువ సంఖ్యలో తమ సేవలు, రోబోట్ల ను మార్కెట్లోకి దించే ప్రయత్నాల్లో ఉన్నాయని సమాచారం.