కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కాస్త తక్కువ
కరోనా నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు ఈ మహమ్మారి సెకండ్ వేవ్ కూడా ఆందోళనకరంగా మారింది. అయితే భారత ఆర్థిక వ్యవస్థపై సెకండ్ వేవ్ ప్రభావం 2020 సంవత్సరం కంటే తక్కువేనని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అయితే ఈ ఏప్రిల్-మే నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగించినందున, ఆర్థిక వ్యవస్థ ఆలస్యంగా కోలుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. గత ఏడాది కంటే తాజాగా కరోనా కేసులు, మరణాలు అధికమవుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తక్కువే ఉండవచ్చునని పేర్కొంది.
అందుకే ప్రభావం తక్కువ
వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంటే ఫైనాన్షియల్ రంగానికి మద్దతుగా ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకోవచ్చునని భావిస్తున్నట్లు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రభుత్వ యంత్రాంగాలు లాక్ డౌన్ను కఠినంగా అమలు చేయడం లేదని, కంపెనీలు, ప్రజల్లోను ఇందుకు తగిన మార్పులు వచ్చాయని, అందుకే ప్రభావం తక్కువగా ఉండవచ్చునని పేర్కొంది. ప్రస్తుతం కరోనా దశ చల్లారినప్పటికీ దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం స్లోగా ఉండటం కారణంగా కరోనా మరోసారి కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉంది ఫిచ్ పేర్కొంది.
చిన్న వ్యాపారాలపై ప్రభావం
కరోనా కేసులు మరింతగా పెరిగినా, మరిన్ని రాష్ట్రాల్లో లేదా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినా రిస్క్ పెరుగుతుందని ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. వ్యక్తిగత రుణగ్రహీతలకు, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఊరటనిస్తూ మే 5వ తేదీన ఆర్బీఐ ప్రకటించిన చర్యల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని పేర్కొంది. గత ఏడాది లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కోలుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ తలెత్తిన కరోనా సంక్షోభం చిన్న వ్యాపారాల్ని మరింత దెబ్బతీస్తుందని, వ్యక్తిగత ఆదాయవర్గాలపై భారం పడుతుందని, ఈ నేపథ్యంలో కేంద్ర బ్యాంకు నుండి మరో ప్యాకేజీని ఫిచ్ అంచనా వేస్తోంది.
కరోనా ఆంక్షలు
క్రెడిట్ గ్యారంటీ స్కీంలు, గత ఏడాది మార్చి-ఆగస్ట్ మధ్య మంజూరు చేసిన తరహాలో రుణాల చెల్లింపుపై పూర్తి మారిటోరియం వంటి చర్యలను ఆర్బీఐ ప్రకటించే అవకాశముందని ఫిచ్ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోను రేపటి నుండి పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నారు.