Retro tax policy: కీలకమైన రెట్రో పన్ను ఉపసంహరణ! కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: వొడాఫోన్-కెయిర్న్ ఎనర్జీ కేసులో ఎదురుదెబ్బల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ పాలసీ(వెనకటి తేదీ నుండి పన్ను చెల్లించాలనే నోటీసులు)కి స్వస్తీ చెప్పాలని భావిస్తోంది. ఇందుకు పన్ను చట్టానికి సవరణలు చేయనుంది. ఇందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోకసభలో ది ట్యాక్సేషన్ లాస్(అమెండ్మెంట్) బిల్, 2021ని ప్రవేశ పెట్టారు. దీని ద్వారా 2012 మే 28వ తేదీకి ముందు జరిగిన భారత ఆస్తుల పరోక్ష బదలీ ట్రాన్సాక్షన్ పైన జారీ చేసిన పన్ను నోటీసులను వెనక్కి తీసుకోవచ్చు.
ఈ కేసుల్లో ఏవైనా రీఫండ్ మొత్తాలు ఉన్నప్పటికీ, వాటిని వడ్డీ లేకుండా చెల్లించడానికి కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ తరహాలో వసూలు చేసిన రూ.8100 కోట్లను తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే 2012 మే నెలకు ముందు జరిగిన భారత ఆస్తుల పరోక్ష బదిలీలపై విధించిన పన్ను నిర్దిష్ట షరతులకు లోబడి సున్నాగా మారిపోతుంది. ఇందుకు సంబంధించి ఏవైనా చట్టబద్ధ వివాదాలు ఉన్నప్పటికీ, వాటిని ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఐటీ చట్టంలో సవరణకు బిల్లు ప్రతిపాదించామని, తద్వారా భవిష్యత్తులో 2012 మే నెలకు ముందు జరిగిన ట్రాన్సాక్షన్స్ పైన వెనకటి తేదీ ఆధారంగా ఎలాంటి పన్ను నోటీసులు జారీ చేయమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
కొద్ది సంవత్సరాలుగా ఆర్థిక, మౌలిక రంగాల్లో ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టామని, దేశంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణాన్ని సృష్టించామని, అయితే వెనకటి తేదీ నుండి పన్ను చెల్లించాలని నోటీసులు ఇస్తుండటం పెట్టుబడుదార్లకు ఇబ్బందిగా మారిందని, కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవాల్సిన తరుణంలో, వేగవంతమైన వృద్ధికి, ఉపాధికి విదేశీ పెట్టుబడులు ఎంతో కీలకమని, అందుకే ఈ బిల్లు ప్రవేశ పెడుతున్నామని ప్రభుత్వం తెలిపింది.