LIC IPO: మూడో రోజు రెట్టింపు: సబ్స్క్రిప్షన్ల సునామీ
ముంబై: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) జారీ చేసిన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్కు పెద్ద ఎత్తున ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభిస్తోంది. రోజురోజుకూ చిన్న మదుపర్ల ఆదరణను అందుకుంటోంది. తొలి రోజుతో పోల్చి చూస్తే.. మూడో రోజు భారీగా అప్లికేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం పోగా.. ఇంకా రెండు రోజుల సమయం మిగిలి ఉన్నందున- కేంద్ర ప్రభుత్వం వేసుకున్న అంచనాల కంటే అధిక మొత్తాన్ని సమీకరించుకునే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
బిగ్గెస్ట్ ఐపీఓగా జారీ..
మొత్తంగా 21,000 కోట్ల రూపాయలను సమీకరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీఓను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తేదీన ఇది ప్రారంభమైంది. 9వ తేదీన ముగియనుంది. శనివారం స్టాక్ మార్కెట్కు సెలవు అయినందున సాధారణంగా ఐపీఓల కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి ఇన్వెస్టర్లకు అవకాశం ఉండదు. ఎల్ఐసీ ఐపీఓ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆ వెసలుబాటును కల్పించింది. శనివారం కూడా ఐపీఓ కోసం మదుపర్లు అప్లికేషన్లను దాఖలు చేయవచ్చు.
ఎల్ఐసీ ప్రైస్ బ్యాండ్ ఇదే..
ప్రైస్ బ్యాండ్ 902 నుంచి 949 రూపాయలతో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. అలాట్మెంట్ రూపంలో ఎల్ఐసీ షేర్లను కొనుగోలు చేయదలిచిన ఇన్వెస్టర్లు ఒక్కో షేర్కు గరిష్ఠంగా 949 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. లాట్ సైజ్ 15గా నిర్ధారితమైంది. అంటే.. ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం 14,235 రూపాయలను పెట్టుబడి రూపంలో పెట్టాల్సి ఉంటుంది. ఇలా 13 లాట్ల వరకు తీసుకోవచ్చు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు 20 శాతం..
ఎల్ఐసీలో 20 శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. దీనిపై ఇదివరకే కేంద్ర మంత్రివర్గం ఓ తీర్మానాన్ని సైతం ఆమోదించిన విషయం తెలిసిందే. ఆటోమేటిక్ రూట్లో ఈ 20 శాతం ఎఫ్డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20 శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడానికి అవకాశాన్ని కల్పించడం ద్వారా అంతమేర అవకాశం స్వదేశీయులకు లేనట్టే. ఎల్ఐసీ యాక్ట్ 1956 ప్రకారం.. దేశీయ జీవిత బీమా సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గానీ, విదేశీ సంస్థలు లేదా వ్యక్తులు వాటాలను కొనుగోలు చేయడానికి గానీ అవకాశం లేనప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం దీన్ని సవరించింది.
మూడో రోజు ఫుల్..
మూడో రోజు నాటికే రిటైల్ పోర్షన్ మొత్తం భర్తీ అయింది. ఉదయం 10.51 నిమిషాలకు రిటైల్ పోర్షన్ ఫుల్ అయినట్లు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వెల్లడించింది. 1.01 సార్లు అధికంగా ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఐపీఓను సబ్స్క్రైబ్ చేసినట్లు వివరించింది. పాలసీ హోల్డర్లు, ఉద్యోగుల పోర్షన్ కూడా పూర్తి స్థాయిలో భర్తీ అయినట్లు పేర్కొంది. ఉద్యోగుల కోటా-2.44, పాలసీ హోల్డర్ల కోటా 3.34 టైమ్స్ సబ్స్క్రిప్షన్ పొందినట్లు బీఎస్ఈ తెలిపింది. ఎల్ఐసీ ఉద్యోగులు, పాలసీ హోలర్డర్లు ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.