భారత రిటైల్ ద్రవ్యోల్భణం మే నెలలో 7.04 శాతం, అయినప్పటికీ...
భారత రిటైల్ ద్రవ్యోల్భణం కాస్త శాంతించింది. 2022 మే నెలకు గాను ఇది 7.04 శాతానికి దిగి వచ్చింది. అయినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరిమితి కంటే ఎక్కువ స్థాయిలోనే ఉంది. ఆర్బీఐ పరిమితి కంటే ఎక్కువగా నమోదు కావడం ఇది వరుసగా అయిదోసారి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంతో పాటు ఆహార ధాన్యాల ధరలు తగ్గినట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది. గత ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.9 శాతంగా ఉంది.
ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (ప్లస్ లేదా మైనస్ 2 శాతం) స్థాయిలో కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ గత ఐదు నెలలుగా ఆర్బీఐ టార్గెట్ను మించుతోంది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 2022 ఏప్రిల్ నెలలో 7.79 శాతంగా ఉండగా, మార్చి నెలలో 6.95 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, జనవరిలో 6.07 శాతంగా నమోదయింది. 2021 మే నెలలో 6.30 శాతం నమోదయింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో తగ్గింది.
నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో గత నెలలో కేంద్రం అప్రమత్తమైంది. సామాన్యులపై ధరాభారాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని తగ్గించింది. ఇతర నిత్యావసర వస్తువులపై పన్ను వ్యవస్థను సవరించింది. పెట్రోల్, డీజిల ధరలు ఎక్కువగా ఉండటంతో గోధుమలు, టమాటా, ఆలు ఇతర కూరగాలయ ధరలు భారీగా పెరిగాయి. ఉత్తర భారతావనిలో వేడి గాలుల వల్ల పంటల దిగుబడులు తగ్గిపోయాయి. అయితే కేంద్రం చర్యలో మే నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం కాస్త సానుకూలంగా ఉంది.