RBI: విదేశాల్లోని భారతీయులకు శుభవార్త.. ఇకపై ఆ చెల్లింపులు సులువు.. రిజర్వు బ్యాంక్ ప్రకటన..
NRI News: భారతదేశం నుంచి చాలా మంది ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉద్యోగ, వ్యాపారాల కోసం వెళ్లి నివసిస్తున్నారు. ఇలాంటి NRIల కోసం ముఖ్యమైన సేవను అందించేందుకు సిద్ధమైంది. దీనిపై ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రోజు ఒక కీలక ప్రకటన చేశారు.
ఆర్థిక సేవల ప్రకటన..
విదేశాల్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు తమ ఇంటికి లేదా తల్లిదండ్రులకు విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ఇతర అన్ని యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. విదేశాల నుంచే ఇక్కడి వారికి సంబంధించిన చెల్లింపులు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ సేవలను భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ (BBPS) ద్వారా అందుబాటులోకి వస్తుంది.
భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ..
భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ (BBPS) ప్రభుత్వ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న సంస్థ. ఇది దేశంలోని ప్రజలకు బిల్లు చెల్లింపు అనుభవాన్ని విపరీతంగా మార్చింది. ఈ వ్యవస్థ కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు వంటి అన్ని ఛార్జీలను చెల్లింపులు చేసేందుకు అందుబాటులో ఉన్న సేవ.
బిల్లు చెల్లింపు..
ఈ భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ.. విద్యుత్, టెలికాం, DTH, గ్యాస్, వాటర్ బిల్లులతో పాటు మొదలైన యుటిలిటీ బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియం, మ్యూచువల్ ఫండ్స్, స్కూల్ ఫీజు, ఇన్స్టిట్యూషన్ ఫీజు, క్రెడిట్ కార్డ్, పాస్ట్యాగ్ రీఛార్జ్, స్థానిక పన్ను చెల్లింపు మొదలైన చెల్లింపులను సులభతరం చేసింది. అనేక హౌసింగ్ సొసైటీ ఫీజులను సింగిల్ విండో ద్వారా చెల్లించేందుకు వెసులుబాటు ఉంది. నెలవారీ ప్రాతిపదికన ప్లాట్ఫారమ్ ద్వారా 8 కోట్లకు పైగా లావాదేవీలు ప్రాసెస్ అవుతున్నాయి.
NRIలకు అందుబాటులోకి..
ఈ సేవ ప్రస్తుతం భారతదేశంలోని ప్రజలు, సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఈ సేవను అందించాలని RBI గవర్నర్ నిర్ణయించారు. ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇతర దేశాల్లోని వారికి ప్రయోజనాలు..
కుటుంబాలకు దూరంగా ఉంటున్న భారతీయులు వయస్సు మీద పడిన తమ తల్లిదండ్రులు, బంధువుల తరఫున అక్కడి నుంచే వారికి సంబంధించిన బిల్లులను చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. విద్యుత్, టెలికాం, DTH, గ్యాస్, నీరు, స్థానిక పన్ను, హౌసింగ్ సొసైటీ బిల్లులతో పాటు మొదలైన ముఖ్యమైన సేవలకు చెల్లింపులు చేయవచ్చు. ఇది పెద్ద మొత్తంలో ప్రయోజనకరంగా ఉండనుంది.