చైనీస్ కంపెనీలకు పేటీఎం డేటా లీక్పై స్పందించిన విజయ్ శేఖర్ శర్మ
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సాధనం పేటీఎం బ్యాంకుకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంకు తన వద్ద ఉన్న డేటాను చైనా కంపెనీలతో షేర్ చేయడం వల్లనే ఆర్బీఐ ఈ చర్యలు తీసుకున్నట్లుగా జోరుగా వార్తలు వచ్చాయి. పేటీఎం సర్వర్లు సమాచారాన్ని చైనా కేంద్రంగా పని చేస్తోన్న కంపెనీలకు చేరవేసినట్లుగా ఆర్బీఐ వార్షిక తనిఖీ నివేదికలో వెల్లడైనట్లు కూడా ప్రచారం జరిగింది. దీనిపై పేటీఎం, వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ స్పందించారు.
డేటా లీక్ ఆరోపణలుపై ఏమన్నారంటే
చైనీస్ కంపెనీలకు డేటా లీక్ అయిందనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఆర్బీఐ డేటా గురించి ప్రస్తావించలేదని పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ అన్నారు. సమాచార నిక్షిప్త నిబంధనలకు బ్యాంకు కట్టుబడి ఉందని తెలిపారు. తాము ప్రాసెస్ చేసే సమాచారం అంతటినీ దేశంలోనే భద్రపరుస్తున్నట్లు చెప్పారు.
అలీబాబాకు వాటా
పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ, పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఉమ్మడి భాగస్వామ్య సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్. 2016 ఆగస్ట్ నెలలో ఏర్పాటయింది. 2017 మే నెలలో కార్యకలాపాలు ప్రారంభించింది. బ్యాంకులో విజయ్ శేఖర్ శర్మకు 51 శాతం, వన్97 కమ్యూనికేషన్స్కు 49 శాతం వాటా ఉంది.
వన్97 కమ్యూనికేషన్స్లో చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ 31 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ పేమెంట్స్ బ్యాంక్ 30 కోట్లకు పైగా మొబైల్ వ్యాలెట్లతో పాటు 60 కోట్ల బ్యాంకు ఖాతాలను కలిగి ఉంది.
పరోక్ష వాటా
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సర్వర్లు బ్యాంకులో పరోక్ష వాటాను కలిగిన చైనా కంపెనీలతో సమాచారాన్ని పంచుకున్నట్లుగా వచ్చాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్బర్గ్ కథనం వెల్లడించింది. డేటా లీక్ చేస్తుండటంతో పాటు కస్టమర్ల కేవైసీ వివరాలను సరిగ్గా తనిఖీ చేయకపోవడంతో బ్యాంకుపై ఆర్బీఐ వేటు వేసిందని ఈ కథనంలో పేర్కొన్నారు. అయితే ఈ వార్తలను పేటీఎం కొట్టి పారేసింది.