సుప్రీంకోర్టులో అనిల్ అంబానీకి ఊరట, కానీ అక్టోబర్ 6న ఫైనల్!
అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో గురువారం ఊరట లభించింది. అనిల్ పైన దివాలాప్రక్రియను తిరిగి ప్రారంభించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అనిల్ అంబానీకి చెందిన రెండు కంపెనీలకు ఇచ్చిన రూ.1,200 కోట్ల రుణాలను రికవరీ చేసుకునేందుకు ఎస్బీఐ ఇటీవల సుప్రీం కోర్టుకు వెళ్లింది. కానీ అత్యున్నత న్యాయస్థానంలో ఎస్బీఐకి చుక్కెదురైంది. అయితే ఇందుకు సంబంధించి ప్రాధాన్యతరీత్యా, తదుపరి విచారణలు ఏమీ లేకుండా అక్టోబర్ 6వ తేదీన కేసు విచారణను చేపట్టి తుది తీర్పు ఇవ్వాలని ఢిల్లీహైకోర్టుకు సూచించడం గమనార్హం. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏదైనా మార్పు కావాలంటే, సంబంధిత న్యాయస్థానాన్నే ఆశ్రయించాలని ఎస్బీఐకి సూచించింది.
ICICI గుడ్న్యూస్, వారికీ రూ.50 లక్షల వరకు హోమ్లోన్: ఎవరెవరికి, ఎలా తీసుకోవాలి?
అనిల్ వ్యక్తిగత హామీ
ఆర్.కామ్., రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 2016లో ఎస్బీఐ రూ.1,200 కోట్ల రుణం మంజూరు చేసింది. ఆర్.కామ్కు రూ.565 కోట్లు, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.635 కోట్ల రుణం ఇచ్చింది. ఇవి మొండి బకాయిలుగా మారాయి. వీటికి అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారు. దీంతో ఆయన ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును రుణాల కింద జఫ్తు చేసుకోవాలని నిర్ణయించింది. ఆ తర్వాత అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసినప్పటికీ, స్పందన రాలేదు.
ఎన్సీఎల్టీలో షాక్.. హైకోర్టులో ఊరట..
ఎస్బీఐ ఎన్సీఎల్టీ(ముంబై బెంచ్)ని ఆశ్రయించింది. గ్యారంటర్పై విచారణ జరపవచ్చునని నిబంధనల్లో ఉందని వాదనలు వినిపించింది. ఎస్బీఐ వాదనతో ఏకీభవించిన ఎన్సీఎల్టీ అనిల్ ఆస్తులపై దివాలా ప్రక్రియకు వీలుగా మధ్యంతర పరిష్కార నిపుణుడిని నియమించింది. ఈ మేరకు ఆగస్ట్ 21వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అనిల్ ఆగస్ట్ 27న ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆయనకు ఊరట లభించింది. హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణనను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఎన్సీఎల్టీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించడంతో ఎస్బీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
హైకోర్టుకు సూచన
అక్టోబర్ 6వ తేదీన ఈ అంశాన్ని పరిశీలించాలని, ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వాయిదాలు వేయవద్దని న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ ఎన్ రావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనానికి సుప్రీం కోర్టు సూచించింది. అలాగే, హైకోర్టులో ఇచ్చిన స్టే ఆర్డరులో సవరణలు కోరే స్వేచ్ఛ ఎస్బీఐకి ఉందని కూడా చెప్పింది.