రిలయన్స్ Q3 ఫలితాలు: జియో దూకుడు, రూ.11,640 కోట్ల నికర లాభం
2019-20 మూడో క్వార్టర్లో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దుమ్మురేపింది. Q3లో నికర లాభం రూ.11,640 కోట్లుగా ప్రకటించింది. రిటైల్, టెలికం వ్యాపారంలో భారీ లాభాల కారణంగా ఇది సాధ్యమైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.10,251 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
కంపెనీ ఏకీకృత ఆదాయం మాత్రం 1.4 శాతం తగ్గి రూ.1,68,858 కోట్లు నమోదు చేసింది. పన్నుకు ముందు లాభాలు 3.6 శాతం పెరిగి రూ.14,962 కోట్లుగా ఉంది. నికర లాభం అత్యధికంగా 13.5 శాతం వృద్ధితో రూ.11,640 కోట్లుగా నమోదయింది. థర్డ్ క్వార్టర్లో తమ ఫలితాలపై అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ల అనిశ్చితి కనిపించిందని, కానీ రిఫైనింగ్ విభాగంలో మెరుగైన సామర్థ్యం కనబరిచామని కంపెనీ పేర్కొంది. అలాగే కన్స్యూమర్ వ్యాపారం కూడా పురోగమిస్తోందని తెలిపింది.

జియో జోష్
రిలయన్స్ ఇండస్ట్రీస్లో టెలికం విభాగమైన రిలయన్స్ జియో Q3 సత్తా చాటింది. ఈ క్వార్టర్లో స్టాండ్లోన్ పద్ధతిలో కంపెనీ నికర లాభం రూ.1,350 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.850 కోట్లుగా ఉంది. కంపెనీ నిర్వహణ ఆదాయం 28.3 శాతం పెరిగి రూ.13,968 కోట్లుగా ఉంది. గత ఏడాది డిసెంబర్ నాటికి జియో ఖాతాదారుల సంఖ్య 37 కోట్ల పైకి చేరుకుంది. Q3లో జియో ఆర్పు రూ.128.4 కోట్లుగా నమోదయింది. అంతకుముందు క్వార్టర్లో ఇది రూ.120గా ఉంది.
రిటైల్ వెంచర్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రెవెన్యూ 27.4 శాతం పెరిగి రూ.45,327 కోట్లుగా ఉంది. ప్రాఫిట్ రూ.1,757 కోట్లతో రెండింతలకు చేరుకుంది. కాగా, శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2.8 శాతం పెరిగి రూ.1,580.65 వద్దకు చేరుకుంది.


Click it and Unblock the Notifications