అందుకే, మేమూ ఛార్జీలు పెంచుతున్నాం: కస్టమర్లకు రిలయన్స్ జియో భారీ షాక్
న్యూఢిల్లీ: వినియోగదారుల నెత్తిన టారిఫ్ భారం పడుతోంది. ఇప్పటికే భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు తాము టారిఫ్ పెంచనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించాయి. మరుసటి రోజే రిలయన్స్ జియో కూడా రానున్న కొద్ది వారాల్లో టారిఫ్ పెంచుతామని కస్టమర్లకు షాకిచ్చింది. జియో రాక తర్వాత ఇటీవలి వరకు చవక ధరలపై యుద్ధం సాగింది. ఇప్పుడు వినియోగదారులకు షాకిస్తూ వరుసగా కంపెనీలు టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటిస్తున్నాయి.
ఛార్జీల పెంపు: దూసుకెళ్తున్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా షేర్
టారిఫ్ పెంచుతాం కానీ..
మొబైల్ ఫోన్ కాల్స్, డేటా ఛార్జీలు పెంచుతున్నట్లు జియో తెలిపింది. ఎప్పటి నుంచి, ఎంత స్థాయిలో పెంచుతారనేది తెలియాల్సి ఉంది. అయితే తాము పెంచే టారిఫ్ ధరలు ఛార్జీల సవరణ, ఖాతాదారుల డేటా వినియోగాన్ని దెబ్బతీయని స్థాయిలో మాత్రమే ఉంటుందని జియో తెలిపింది. అలాగే, డిజిటల్ సేవల వృద్ధిని దెబ్బతీయకుండా, పెట్టుబడులపై సముచిత రాబడులు ఉండే స్థాయిలో ఛార్జీల పెంపు ఉంటుందని పేర్కొంది. దేశీయ టెలికం రంగాన్ని బలోపేతం చేసి కస్టమర్లకు ప్రయోజనాన్ని అందించడంలో భాగంగా టారిఫ్ పెంచుతున్నట్లు జియో తెలిపింది. దీంతో డేటా వినియోగం, డిజిటల్ అనుసరణలపై ప్రతికూల ప్రభావం ఉండదని తెలిపింది.
అందుకే ధరలు పెంచాం...
నిబంధనలకు అనుగుణంగా తాము ధరలను పెంచవలసిన పరిస్థితి అని జియో తెలిపింది. కాగా, ఇటీవల జియో తమ కస్టమర్లపై IUC ఛార్జీలను ప్రారంభించిన విషయం తెలిసిందే. జియో నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్స్కు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్ ఉంటుంది. ఇందుకు రెగ్యులర్ ప్యాకేజీలకు అదనంగా ఈ రూ.10 నుంచి వెయ్యి రూపాయల వరకు టాపప్స్ కూడా తీసుకు వచ్చింది.
రాజీపడేది లేదు..
మరోవైపు, టారిఫ్ సవరణల కోసం సంప్రదింపుల ప్రక్రియ చేపట్టే వీలుందని జియో తెలిపింది. తమ కస్టమర్లకు అత్యుత్తమ, నాణ్యమైన సేవల్ని అందించడంలో రాజీపడే ప్రసక్తి లేదని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి జియో కస్టమర్ల సంఖ్య 35.52 కోట్లుగా ఉంది.
యూజర్లు ఎంతమంది అంటే..
సెప్టెంబర్ నెలలో కొత్తగా 69.83 లక్షల యూజర్లు జత కావడంతో జియో కస్టమర్ల సంఖ్య 35.55 కోట్లకు చేరుకుంది. ఎయిర్టెల్ 23.8 లక్షల యూజర్లను కోల్పోగా, సబ్స్క్రైబర్స్ సంఖ్య 32.55 కోట్లుగా ఉంది. వోడాఫోన్ ఐడియా 25.7 లక్షల చందాదారులను కోల్పోయి, 37.24 యూజర్ బేస్ను కలిగి ఉంది.
ట్రాయ్ ఏమన్నదంటే?
ఇదిలా ఉండగా, కాల్, డేటా చార్జీల పెంపుపై టెలికాం కంపెనీల నుంచి తమకు సమాచారం లేదని ట్రాయ్ తెలిపింది. డిసెంబర్ 1 నుంచి చార్జీలు పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్, జియో వరుసగా ప్రకటించాయి. అయితే పెంపు ఏ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని కంపెనీలు వెల్లడించలేదు. కంపెనీలు పెంపు విషయం వెల్లడించిన అనంతరం అది ట్రాయ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా.. లేదా.. అనే విషయాన్ని పరిశీలిస్తామని ట్రాయ్ అధికారులు అంటున్నారు.