అమెజాన్ జెఫ్ బెజోస్కు రిలయన్స్ ముఖేష్ అంబానీ భారీ ఆఫర్!
మొన్నటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫాంలోకి ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులుపెట్టాయి. తాజాగా రిలయన్స్ రిటైల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సిల్వర్ లేక్ రూ.7500 కోట్లు పెట్టుబడులు పెట్టగా, కేకేఆర్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ విభాగంలో దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన వాటాను అమెజాన్కు విక్రయించాలని భావించింది. ఈ మేరకు మీడియాలో వార్తల వచ్చాయి. దీని ప్రకారం అమెజాన్, రిలయన్స్ మధ్య చర్చలు జరిగాయి. పెట్టుబడులకు అమెజాన్ ఆసక్తి కనబరుస్తోందని తెలుస్తోంది.
'టార్గెట్'ను చేధించిన రిలయన్స్, షేర్ రికార్డ్: రూ.15 లక్షల కోట్లతో సరికొత్త రికార్డ్
40 శాతం మేర వాటా
రిలయన్స్ జియోలో వాటాల విక్రయం ద్వారా ఫేస్బుక్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీల నుండి 20 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించారు ముఖేష్ అంబానీ. రిలయన్స్ రిటైల్ వ్యాపారంలో 20 బిలియన్ డాలర్లకు 40 శాతం వాటాను అమెజాన్కు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అటు అమెజాన్, ఇటు రిలయన్స్ స్పందించాల్సి ఉంది. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నాలుగేళ్ల క్రితం రిలయన్స్ జియోను ప్రారంభించి విజయవంతంగా దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇది రిలయన్స్ డిజిటల్ ప్లాట్ఫాం.
రిలయన్స్ రిటైల్ దూకుడు
అమెజాన్కు వాటా విక్రయం ద్వారా రిటైల్ విభాగంలో మరింత పట్టు సాధించాలని భావిస్తున్నారు ముఖేష్ అంబానీ. ఈ పెట్టుబడులపై ఇరు కంపెనీల మధ్య చర్చలు జరిగినప్పటికీ, ఇంకా ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదని సమాచారం. రిలయన్స్ రిటైల్ దాదాపు 12000 స్టోర్స్ కలిగి ఉంది. గత నెలలో ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ మార్కెట్ను సొంతం చేసుకుంది. బుధవారం రిలయన్స్ రిటైల్లో సిల్వర్ లేక్ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. వరుస పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స్ రిటైల్ షేర్ రెండు రోజుల్లో 10 శాతానికి పైగా పెరిగింది. ఈ రోజు ఒక్కరోజే 7 శాతానికి పైగా పెరిగింది.
7.29 శాతం ఎగిసిన రిలయన్స్ షేర్
గతంలో రిలయన్స్లో జియో పెట్టుబడుల తర్వాత షేర్ ధర రూ.2000 క్రాస్ చేసింది. రిటైల్లో పెట్టుబడుల నేపథ్యంలో ఈ రోజు రూ.2,319 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ లేక్ పెట్టుబడులు, కేకేఆర్ ఇన్వెస్ట్ చేస్తుందని వార్తలు రావడం, అమెజాన్-రిలయన్స్ మధ్య చర్చల వార్తల నేపథ్యంలో ఈ రోజు షేర్ 7.29 శాతం మేర పెరిగింది. అంతకుముందు సెషన్లో షేర్ ధర 2.58 శాతం ఎగిసి రూ.2161.25 వద్ద క్లోజ్ అయింది.
దీంతో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.15 లక్షల కోట్ల మార్క్ సమీపానికి చేరుకుంది. మొదటిసారి జూలై 27, 2020వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.14.51 లక్షల కోట్లకు చేరుకుంది. రెండోస్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.8.8 లక్షల కోట్లుగా ఉంది.