కరోనా టైంలోను మోడీ వెనుకాడలేదు, మరింత జోరు.. ఆగదు: నిర్మల సీతారామన్
న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణ, ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలసీతారామన్ తెలిపారు. వివిధ కంపెనీల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ మున్ముందు మరింత వేగవంతం కానుందని తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కరోనా దీనికి దెబ్బకొట్టింది. ఇప్పటి వరకు కేవలం రూ.6100 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి స్పందించారు. సోమవారం సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు.
బ్యాంకులపై పిడుగుపాటు, కార్పోరేట్లు ఈజీగా నిధులు మంజూరు చేసుకుంటారు
పెట్టుబడులకు గమ్యస్థానంగా..
దేశాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నట్లు నిర్మల తెలిపారు. కరోనా కారణంగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవటంతో పాటు సంస్కరణలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న కీలక సంస్కరణలను అమలు చేసేందుకు అవకాశం లభించిందన్నారు. అందుకే కరోనా సమయంలోను భారీ సంస్కరణలను ప్రధాని మోడీ చేజారనివ్వలేదన్నారు. దీనిని ప్రధాని అవకాశంగా మలుచుకున్నారన్నారు. సంస్కరణలపై ఇదే జోరు కొనసాగుతుందన్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుంది
ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కొనసాగిస్తామని నిర్మల తెలిపారు. పన్ను వివాదాలు సత్వరం పరిష్కారమయ్యేందుకు భారీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ఈ దిశగా అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. సంస్కరణల అజెండాకు కొనసాగింపుగా పలు రాష్ట్రాల్లో ఫార్మా, వైద్య పరికరాలు, ఏపీఐల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా తయారీ జోన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సింగిల్ విండో విధానం
ఇతర దేశాలకు చెందిన సంస్థలు మనవద్ద కార్యకలాపాలు ప్రారంభించడాన్ని మరింత సులభతరం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇందుకు ఏకీకృత సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారత్ నుంచి ఆశిస్తున్న అంశాలన్నింటిని రాబోయే బడ్జెట్లో పొందుపరుస్తామన్నారు. పలు సార్వభౌమ ఫండ్ సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.