పన్ను తగ్గింపు కాదు... ఖర్చులు పెంచండి!
అదేమిటీ... బడ్జెట్ అంటేనే అందరూ ఎంతో కొంత పన్ను తగ్గించాలని అడుగుతారు. మీరేమిటీ వద్దని చెబుతున్నారు అని ఆశ్చర్యపోకండి. ఇది అక్షరాలా నిజం. దేశానికి, ముఖ్యంగా ప్రస్తుతం భారత దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి అసలు మందు ఖర్చు చేయటం. అంటే, పౌరులను ఖర్చు చేయమని కాదు. ప్రభుత్వం ఖర్చు చేయాలి. అది కూడా భారీ తరహా ప్రాజెక్టులు, రోడ్లు, రైల్వేలు, పోర్టులు, ఎయిర్పోర్ట్ లు సహా అనేక ఇతర మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలి. అంటే పెట్టుబడి మిళితమైన ఖర్చు అన్నమాట. దాంతోనే ఆర్థిక వ్యవస్థ తప్పకుండ సర్దుకుంటుంది. అంతేగానీ ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు తగ్గిస్తూ పొతే ... ఖజానా ఖాళీ అవుతుందే కానీ ప్రయోజనం శూన్యం. ఇప్పటికే ఈ విషయం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు అర్ధమయ్యే ఉండాలి. ఒక వేళ అర్థం కాకపొతే ఆర్థిక నిపుణులను సలహాలు, సూచనలు కోరవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ ఎక్సపెన్డిచరు (ప్రభుత్వ వ్యయం) పెరిగిన దేశాల్లో మాత్రమే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. అప్పుడు మాత్రమే ఉపాధి కల్పన సాధ్యమయింది. తద్వారా ప్రజల వద్దకు నిధుల ప్రవాహం చేరుకుంది. దానిని వారు ఖర్చు చేసారు. అంతే, ఎకానమీ వృద్ధి చెందింది.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు
గుణపాఠం నేర్వాలి...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేవలం మాటల గారడితో దేశ ప్రజలను, అలాగే ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటున్నారని పొలిటికల్ అనలిస్టులు చెబుతుంటారు. అది నిజం కూడా అనిపిస్తుంటుంది. ఎందుకంటే, 2014 లో ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఎకానమీ ని ఉద్ధరించలేదు సరికదా... నోట్ల రద్దు, జీఎస్టీ అంటూ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీశారు. ప్రతి విషయంలోనూ గత ప్రభుత్వాలను బూచిగా చూపి విమర్శలు గుప్పించారు. అయన మాటలను విశ్వసించి పోనీలే ఏదో మార్పు తెచ్చేలా ఉన్నాడని ప్రజలు రెండో సారి కూడా అధికారం కట్టబెట్టారు. అయినా సరే... ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రధాని చేసిన ప్రయత్నాలు శూన్యం అని చెప్పాలి. పైగా దేశానికి ఇప్పటికిప్పుడు అవసరం లేని విధానాలు ముందుకు తెచ్చి దేశాన్ని ఏ దిశగా నడిపించాలనుకుంటున్నారో చెబుతున్నారు. నోట్ల రద్దు సయమంలో ఆర్థిక వేత్తలు అందరూ హెచ్చరించినా వినలేదు. అలాగే జీఎస్టీ విషయంలోనూ వెనకడుగు వేయలేదు. వాటి వ్యతిరేక ఫలితాలు ఇప్పుడు దేశం అనుభవిస్తోంది.
ఆర్థిక మంత్రికి అర్థం కాని సబ్జెక్టు...
ఎకానమీ అర్థం చేసుకోవటం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అది కూడా ఇంటిని చక్కదిద్దే ఒక మహిళకు దేశాన్ని ఎలా చక్కదిద్దాలో బాగా తెలుస్తుంది. దురదృష్టవశాత్తు మన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ విషయంలో అది కనిపించటం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతెందుకు స్వయానా ఆమె భర్త, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తపరిచారు. ఎందుకంటే నొప్పి ఒక చోట ఉంటె.. ట్రీట్మెంట్ మరో చోట ఇస్తున్నారు. ఇందుకు మంచి ఉదాహరణే కార్పొరేట్ టాక్స్ తగ్గింపు. కేవలం గొప్పల కోసమే తీసుకున్న ఆ నిర్ణయంతో ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు సరికదా రూ 1.45 లక్షల కోట్ల మేరకు పన్ను రాబడులు తగ్గాయి. అంటే పన్ను తగ్గిస్తే.. తద్వారా మిగిలిన సొమ్మును కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెడతాయని, దాంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశించారు. కానీ భంగపాటు మాత్రమే మిగిలింది.
పర్సనల్ టాక్స్ తగ్గింపు సరికాదు...
కార్పొరేట్ టాక్స్ తగ్గిస్తే ఏం జరిగిందో... సరిగ్గా పర్సనల్ ఇన్కమ్ టాక్స్ తగ్గించినా అదే జరుగుతుంది. దానికి భిన్నంగా ఏమీ జరగదు. ఎందుకంటే... పన్ను తగ్గింపు వల్ల మిగిలిన సొమ్మును ప్రజలు తప్పనిసరిగా ఖర్చు చేస్తారన్న నమ్మకం లేదు. గ్యారంటీ ఉండదు కూడా. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉంటె... ప్రత్యక్ష పన్నులు కట్టే వారి సంఖ్య 5 కోట్లు కూడా లేదు. మరి వాళ్ళు కూడా పన్నులు కట్టకపోతే ఇక ప్రభుత్వ ఖజానాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పటికే ప్రభుత్వ ఘనకార్యం వల్ల ప్రత్యక్ష, పరోక్ష పన్నులు సుమారు రూ 3 లక్షల కోట్ల మేరకు పడిపోతున్నాయి. మరి ఇంత భారీ మొత్తంలో ఎక్కడి నుంచి ప్రభుత్వం నిధులను సమీకరిస్తుంది? పన్నులు మరింత తగ్గిస్తే మరో రెండు లక్షల కోట్లు తగ్గితే అప్పుడు దేశాన్ని ఎలా నడిపిస్తారో ప్రధాని, ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని ఆర్థికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
సరళీకరణ మేలు...
పన్ను రేట్లు తగ్గింపు కన్నా ప్రజలకు సరళమైన విధానాలు అందించాలి. అధిక పొదుపు అవకాశాలను కల్పించాలి. జీఎస్టీ వంటి సంక్లిష్టమైన పన్ను వ్యవస్థను చాలా సులభతరం చేయాలి. అప్పుడే ప్రజలు పన్నులు ఎగ్గొట్టే బదులు, అధిక ప్రయోజనం అందించే పథకాలను వినియోగించుకునేందుకు ముందుకు వస్తారు. అప్పుడు పన్నులు పెరుగుతాయి. పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగాలు లభిస్తాయి. ప్రజలను, కార్పొరేట్ కంపెనీలను పన్నులు ఎగ్గొట్టే దోషులుగా చూడకుండా.. వారు చెల్లిస్తున్న పన్నుల వల్లే ప్రభుత్వాలు నడుస్తున్నాయన్న అంశానికి ప్రాధాన్యత పెరగాలి. పెనాల్టీలు, జైళ్లు, శిక్షల స్థానే ఫ్రెండ్లీగా పన్నులు, బకాయిలు చెల్లించే వ్యవస్థను అందించగలగాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది అని నిపుణులు చెబుతున్నారు.