2020లో భారీగా ఎగిసిన బిట్కాయిన్, కారణమిదే: 2021లోను హైజంప్!
వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్ 2020 క్యాలెండర్ ఏడాదిలో భారీగా ఎగిసింది. ఈ మూడు నాలుగు రోజుల్లోనే అంతకంతకూ పెరిగింది. డిసెంబర్ 25న 25వేల డాలర్లు పలికిన బిట్ కాయిన్, మరుసటి రోజు 26వేలు, 27న 27వేల డాలర్లుగా నమోదయింది. 2021లోను బిట్ కాయిన్ వ్యాల్యూ భారీగా పెరుగతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత మార్చి నెలలో 5000 డాలర్లు పలికిన బిట్ కాయిన్ ఇప్పుడు 27వేల పైకి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 50వేల కోట్ల డాలర్ల వరకు ఉంది. ఇందులో వీసా అన్నింటి కంటే ముందు ఉన్నది.
జనవరి 1 నుండే మార్పు... ఫాస్టాగ్ లేకుంటే వాచిపోతుంది.. డబుల్ టోల్ట్యాక్స్
బిట్ కాయిన్ భారీ జంప్
బిట్ కాయిన్స్ మంచి రిటర్న్స్ అందిస్తోంది. గత కొంతకాలంగా మంచి రిటర్న్స్ అందిస్తోన్న ఈ క్రిప్టోకరెన్సీ కొనుగోలుకు పెట్టుబడిదారులు, కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మరింత ఆసక్తి చూపుతున్నారు. దీంతో గత వారం రోజులుగా దూసుకుపోతోంది. ఓ దశలో 1,500 డాలర్ల స్థాయికి పడిపోయిన బిట్ కాయిన్ వ్యాల్యూ ఇప్పుడు 28 వేల డాలర్ల మార్కుకు చేరువలో ఉంది. కేవలం 2020లోనే 200 శాతం పెరిగింది.
30వేల డాలర్లకు..
ట్రేండ్ ఇలాగే కొనసాగితే త్వరలో 30 వేల డాలర్లకు చేరుకోనుందని, ఈ క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ 2030 నాటికి రూ.కోటి(1,35,00 డాలర్లు)కి చేరుకునే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 2009 నుంచి అందుబాటులోకి వచ్చిన తొలి క్రిప్టో కరెన్సీ ఇది.
అందుకే బిట్ కాయిన్ జంప్
ద్రవ్య లభ్యతపై ఆంక్షలు ఎత్తివేసిన వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బిట్ కాయిన్ మార్కెటింగ్కు ఎకోసిస్టమ్ను సృష్టించాయి. కరోనా వ్యాక్సినేషన్ అనంతరం ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో 2021లోను బిట్ కాయిన్ వ్యాల్యూ పెరగవచ్చునని అంటున్నారు. సాధారణంగానే ద్రవ్యోల్బణం ధోరణులకు వ్యతిరేకంగా బిట్ కాయిన్ ఎగిసిపడుతుంది.
కొద్ది రోజుల్లోనే...
బిట్ కాయిన్ 2018లో భారీగా క్రాష్ అయింది. ఆ తర్వాత నుండి ఇది ఎగిసి పడుతోంది. ప్రస్తుతం బిట్ కాయిన్ వ్యాల్యూ రూ.20 లక్షలు లేదా 27,075 డాలర్లుగా ఉంది. ఆదివారం ఈ డిజిటల్ కరెన్సీ 28వేల డాలర్లను కూడా తాకింది. కొద్ది రోజుల క్రితమే 20 వేల డాలర్లను దాటిన ఈ క్రిప్టో కరెన్సీ ఇప్పుడు 30వేల దిశగా సాగుతోంది. 2020 ప్రారంభంలో 7200 డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ ఇప్పుడు 28,000 డాలర్లకు చేరుకుంది.