డిజిటల్ రూపీ.. త్వరలో అందుబాటులోకి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ఓ డిజిటల్ కరెన్సీని పరిచయం చేయబోతుంది. దశలవారీగా దీనిని చలామణిలోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో పైలట్ ప్రాజెక్టుల్లో భాగంగా కరెన్సీని హోల్సేల్, రిటైల్ విభాగాల్లో ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవిశంకర్ తెలిపారు.
ఇప్పటికే హోల్సేల్, రిటైల్ సెగ్మెంట్లలో పలు దేశాల సెంట్రల్ బ్యాంక్లు తమ డిజిటల్ కరెన్సీలను వాడుకలోకి తెచ్చాయని ఆయన గుర్తుచేశారు. ది విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ నిర్వహించిన ఆన్లైన్ చర్చలో రవిశంకర్ పాల్గొన్నారు. దేశీయంగా సెంట్రల్ బ్యాంకే ఓ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రైవేట్ వర్చువల్ కరెన్సీ వాడకంతో వచ్చే లాభాలను ప్రజలందరికీ చట్టబద్దంగా అందించినట్లు అవుతుందని వివరించారు.
డిజిటల్ కరెన్సీకి ఓ రూపాయి తరహాలో ప్రాధాన్యత కల్పించవచ్చని అన్నారు. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీల్లో తలెత్తే ఒడిదుడుకుల నుంచి ప్రజలను రక్షించినట్లు అవుతుందని కామెంట్ చేశారు. నగదుపై ఆధారపడటం తగ్గి, లావాదేవీల వ్యయం దిగివస్తుందనే దీనివల్ల అటు పరిశ్రమకు ఇటు ప్రజలకు లాభం చేకూరగలదని అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా ఇందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను, బ్యాంకర్లు-పరిశ్రమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం వస్తుందన్నారు. ఎందుకంటే దీని విలువ పడిపోతే బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఒత్తిడికి గురయ్యే ప్రమాదం లేకపోలేదన్నారు.