rbi repo: మళ్లీ పెరగనున్న వడ్డీరేట్లు.. రుణ గ్రహీతలకు మరోసారి వడ్డింపు షురూ !!
rbi repo: ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు. దీనిపై జనాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఫిబ్రవరి 8 న విడుదల కానున్న RBI మానిటరీ పాలసీ నిర్ణయాల కోసం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, రుణ గ్రహీతలు ఆతృతగా చూస్తున్నారు. బడ్జెట్ తర్వాత మొదటి సమావేశం కావడంతో వడ్డీరేట్లపై RBI ఏ నిర్ణయం తీసుకుంటుందోనని కొంత ఉత్కంఠ నెలకొంది.
పెద్ద మార్పు ఉండదు..
రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందన్న సంకేతాలు, US ఫెడ్ వడ్డీ రేటులోనూ అంతగా పెరుగుదల లేకపోవడంతో.. రెపో రేటులో పెరుగుదల తక్కువే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న మానిటరీ పాలసీ సమీక్షలో.. ప్రస్తుత రేటుకు మరో 25 బేసిస్ పాయింట్లు జోడించి 6.5 శాతానికి పరిమితం చేస్తారని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా గృహ రుణాలు, ఫ్లోటింగ్ రేటుపై తీసుకున్న ఇతర రుణాలు, EMIలపై వడ్డీ భారం మరింత పెరగనుంది. ఫిబ్రవరి 8న కమిటీ నిర్ణయాన్ని RBI ప్రకటించనుంది.
భవిష్యత్తు బాగుంటుంది:
"ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతున్నా, ఇప్పటికీ అంచనాల కంటే కొంత ఎక్కువగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి దేశ కేంద్ర బ్యాంకూ దీనిని దారిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ముందు ముందు ద్రవ్యోల్బణం మరింతగా బలహీనపడుతుంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే ధరలు పెరగడంలో బాగా తగ్గుదల కనిపిస్తుంది. 2024 ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో ధరలు దిగి వస్తాయని ఆశిస్తున్నాం" అని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన నివేదికలో పేర్కొంది.
బలంగా మన ఆర్థిక మూలాలు:
ఇటీవల జరిగిన FIMMDA-PDAI వార్షిక సదస్సులో ద్రవ్యోల్బణంపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. కొన్ని నెలల క్రితం అంచనా వేసిన తీవ్రమైన, కఠిన మాంద్యం పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదన్నారు. 2022 నవంబర్, డిసెంబర్ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు మాత్రం బలంగా ఉన్నయాని ధీమా వ్యక్తం చేశారు.
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతానికి కట్టడి చేయాలని RBI లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా.. జనవరి 2022 నుంచి లక్ష్యం కంటే ఎక్కువగానే ఉండటం ఆందోళన కలిగించే అంశం.
గత మూడు దఫాలకంటే తక్కువే:
ప్రతి రెండు నెలలకొకసారి RBI మానిటరీ పాలసీ సమీక్షను నిర్వహిస్తుంది. మూడు దఫాలుగా 50 బేసిస్ పాయింట్లను పెంచగా.. గత డిసెంబర్ లో మాత్రం కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేటుని 35 పాయింట్లకు పరిమితం చేసింది. గతేడాది మే నుంచి చూస్తే, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం స్వల్పకాలిక రుణ రేటును రిజర్వ్ బ్యాంక్ 225 బేసిస్ పాయింట్లు పెంచింది. కొవిడ్ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా సరఫరాలో అంతరాయం వంటి వివిధ కారణాల వల్ల ఈ చర్యలు తీసుకున్నట్లు గతంలో వెల్లడించింది.