కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు అండగా నిలిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుకు వచ్చింది. ఈ మేరకు ఫండ్స్ పరిశ్రమలో ద్రవ్య లభ్యతను పెంపొందించేందుకు రూ.50,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్ని అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రత్యేక లిక్విడిటీ పథకం ద్వారా 90 రోజుల కాలపరిమితి గల రెపో సౌకర్యాలు ఉంటాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇటీవల ఆరు డెట్ ఫండ్ స్కీంలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్థిక కష్టాలు తొలగించేందుకు రంగంలోకి ఆర్బీఐ
కరోనా ప్రభావంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ కూడా సంక్షోభంలోకి వెళ్తోంది. నగదు వెనక్కి తీసుకుంటున్నారు. ద్రవ్య లభ్యతకు సంబంధించి ఇబ్బందులు పడుతోంది. ఉపసంహరణలు భారీగా పెరగడంతో ఒత్తిడికి గురయ్యాయి. ఈ ఒత్తిడి హైరిస్క్ పథకాల్లో మాత్రమే ఉందని చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ పథకాలపై ఉన్న ఆర్థిక కష్టాలను తొలగించాలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక ద్రవ్య లభ్యత వసతి కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు ఆర్బీఐ సిద్ధమని వెల్లడించింది. ఆర్బీఐ నిర్ణయంతో సోమవారం మ్యూచువల్ ఫండ్స్ షేర్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి.

మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకే వినియోగించాలి
ఆర్బీఐ ప్రకటించిన లిక్విడిటీ సౌకర్యాలను బ్యాంకులు కేవలం మ్యుచువల్ ఫండ్ (MF) పరిశ్రమ అవసరాల కోసమే వినియోగించాలి. ఇందులో భాగంగా MFలకు రుణాలు అందించడం, ఫండ్స్ వద్ద గల కార్పోరేట్ బాండ్స్, కమర్షియల్ పేపర్స్, డిబెంచర్స్ వంటి హామీలతో లిక్విడిటీని సమకూర్చవవచ్చునని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మంచి ఉపశమనంగా చెబుతున్నారు. ఈ మేరకు మాజీ కేంద్రమంత్రి చిదంబరం కూడా ప్రశంసించారు. ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పథకాలు నిలిపివేత సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు. ఆర్బీఐ నిర్ణయం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని తిరిగి పెంపొందిస్తుందని అసోచామ్ పేర్కొంది.

లిక్విడిటీ అవసరాలకు
స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ (SLF-MF) కింద 90 రోజుల వ్యవధిలో రెపో కార్యకలాపాలను స్థిర రెపో రేటుతో నిర్వహిస్తుంది. మే 11వ తేదీ వరకు లేదా కేటాయించిన నిధులు మొత్తం ఉపయోగించుకునే వరకు బిడ్స్ సమర్పించవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లిక్విడిటీ అవసరాలు తీర్చేందుకు మాత్రమే బ్యాంకులు వీటిని ఉపయోగించాలి. మ్యూచువల్ ఫండ్స్కు బ్యాంకులు లోన్స్ను ఎక్స్టెండ్ చేయవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్కు ఊరట
ఆర్బీఐ ప్రకటన మ్యూచువల్ ఫండ్స్కు భారీ ఊరటగా భావిస్తున్నారు. ప్రాంక్లిన్ టెంపుల్టన్ తర్వాత ఇది తీవ్ర ఒత్తిడిలో ఉంది. ముఖ్యంగా క్రెడిట్ రిస్క్ ఫండ్ కేటగిరీలో ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇందులో రూ.55,000 కోట్లకు పైగా అసెట్స్ ఉన్నాయి. డెట్ సెగ్మెంట్లో మార్చి నెలలో రూ.1.94 కోట్ల ఔట్ ఫ్లో ఉంది.


Click it and Unblock the Notifications