RBI Monetary Policy: సెప్టెంబర్ నుండి చెక్ క్లియరెన్స్ ఫాస్ట్గా
ముంబై: చెక్కు క్లియరెన్స్ను వేగవంతం చేసే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా 2021 సెప్టెంబర్ నుండి అన్ని బ్యాంకు శాఖలని చెక్ ట్రంకేషన్ సిస్టం(CTS) కిందకు తీసుకు రానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తెలిపింది. ఇప్పటి వరకు ఇది ప్రధాన కార్యాలయాల్లోనే పని చేస్తోంది. సెప్టెంబర్ నుండి అన్నింటికి వర్తింప చేయనున్నారు. ఇప్పటికి దాదాపు 18,000 బ్యాంకు శాఖలు ఫార్మల్ క్లియరింగ్స్కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. 2021 సెప్టెంబర్ నాటికి వీటన్నింటిని CTS పరిధిలోకి తేనున్నట్లు తెలిపారు.
ఆర్బీఐ పరపతి ద్రవ్య విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా రెపోరేటు, రివర్స్ రెపో రేటును యథాతథంగా ఉంచారు. వరుసగా నాలుగోసారి ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగుతాయి. వృద్ధి రేటుకు అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఎలాంటి మార్పులు చేయలేదని శక్తికాంత దాస్ తెలిపారు.
ద్రవ్యోల్బణం తిరిగి గాడిన పడుతోందన్నారు. కరోనా సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. మౌలిక, వైద్య ఆరోగ్య రంగాలకు బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు. స్వల్పకాలంలో కూరగాయధరలు అదుపులోనే ఉండే అవకాశముందన్నారు. రుణాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగదు నిల్వల నిష్పత్తి(CRR)ని మే 27న జరిగే తదుపరి పరపతి సమీక్ష నాటికి తిరిగి 4 శాతానికి పునరుద్ధరించే చర్యలు ఉంటాయని తెలిపారు.
త్వరలో రిటైల్ ఇన్వెస్టర్లను నేరుగా గవర్నమెంట్ సెక్యూరిటీ మార్కెట్లోకి అనుమతించనున్నట్లు తెలిపారు. కస్టమర్ల ఫిర్యాధుల పరిష్కారానికి ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీంను జూన్ 2021 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు.