Yes Bank crisis: ఆర్బీఐ కీలక నిర్ణయం! రూ.10 వేల కోట్ల బాండ్ హోల్డర్స్ మనీపై ప్రభావం
పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రయివేటు రంగ యస్ బ్యాంకును ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుకు వచ్చింది. యస్ బ్యాంకు సంక్షోభాన్ని 30 రోజుల్లో పరిష్కరిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. బ్యాంకింగ రంగంలో స్థిరత్వాన్ని సాధించేందుకు బ్యాంకుపై మారటోరియం విధించినట్లు తెలిపారు. బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు ఇదే సరైన సమయమన్నారు. యస్ బ్యాంకును పునరుద్ధరించేందుకు త్వరలో కొత్త పథకంతో వస్తామన్నారు.
యస్ బ్యాంకును గట్టెక్కించడంలో భాగంగా సేకరించిన అడిషనల్ టైర్ వన్ (AT1) రుణ బుక్ను శాశ్వతంగా కొట్టి వేయనున్న నేపథ్యంలో బాండ్ హోల్డర్స్ మనీపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో సబ్స్క్రైబర్లు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఈ ప్రభావం నిప్పోన్ లైఫ్ ఇండియా ఏఎంసి, మ్యూచువల్ ఫండ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, యూటీఐ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ పెన్షన్ ఫండ్ ట్రస్ట్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తదితరాలపై ప్రభావం పడనుంది. యస్ బ్యాంకు ఇష్యూ చేసిన బాండ్స్ ద్వారా వీటితో పాటు వివిధ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి.
యస్ బ్యాంక్ క్రైసిస్: మరిన్ని కథనాలు..
కాగా, యస్ బ్యాంకుపై మారటోరియం విధించడాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమర్థించుకున్నారు. యస్ బ్యాంకుకు సంబంధించిన అంశాలను వేగంగా పరిష్కరించనున్నామని హామీ ఇచ్చారు. యస్ బ్యాంకుకు సంబంధించిన అంశాల పరిష్కారం వేగవంతంగా జరుగుతుందని, 30 రోజుల గరిష్ఠ పరిమితి ఉందని, డిపాజిటర్ల ప్రయోజనాలను పూర్తిగా కాపాడతామని శక్తికాంత దాస్ అన్నారు. అంతర్గత పరిష్కారం కోసం తగిన సమయమిచ్చినప్పటికీ యస్ బ్యాంకు సరైన పరిష్కారంతో రాలేకపోయిందన్నారు.