అప్పటికే యాక్ట్ ఆఫ్ గాడ్ విజ్ఞప్తుల వెల్లువ, వీరికి EMI ఊరట రెండు నెలలే!
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో వ్యాపారాలు మూతబడ్డాయి. అత్యవసర ఆహారధాన్యాలు, కూరగాయలు, వైద్యం వంటివి మినహా మిగతా దుకాణాలు మూతబడ్డాయి. అలాగే, చిన్న చిన్న కంపెనీలు, పరిశ్రమలు నడవడం లేదు. దీంతో ఈ కంపెనీలు వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగానే మారింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు, ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఆర్బీఐ రెండు రోజుల క్రితం కీలక ప్రకటన చేసింది. మూడు నెలల పాటు ఈఎంఐల చెల్లింపుపై మారటోరియం విధించింది. అయితే అంతకుముందే చాలామంది కస్టమర్లు ఈ మేరకు బ్యాంకులకు విజ్ఞప్తులు చేశారట.
ట్విస్ట్: మీరు నిజంగానే 3 నెలలు EMI కట్టక్కర్లేదా, క్రెడిట్ కార్డు బిల్లు పరిస్థితేమిటి?
బ్యాంకులకు విజ్ఞప్తులు
వ్యాపార నిబంధనల్లోని యాక్ట్ ఆఫ్ గాడ్ సెక్షన్ ఇప్పుడు తమకు వర్తిస్తుందని, ఆ మేరకు వెసులుబాటు ఇవ్వాలని బ్యాంకుల వద్ద వ్యాపార సంస్థలు విజ్ఞప్తులు పెట్టుకున్నాయట. ప్రకృతి విపత్తులు, అంటువ్యాధులు, యుద్ధాలు సంభవించినప్పుడు పరిస్థితి మనిషి చేయిదాటితే ఏం చేయాలన్న అంశాలను యాక్ట్ ఆఫ్ గాడ్ నిబంధన చెబుతుంది.
కరోనా.. లోన్ రీషెడ్యూల్..
ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు తమ కస్టమర్ల కష్టాలను దృష్టిలో ఉంచుకొని లోన్ చెల్లింపులను తాత్కాలికంగా వాయిదా వేయటం, కొన్ని నిబంధనలను అనుసరించి రద్దు చేయడం వంటివి ఉంటాయి. కరోనా కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్న చాలామంది తమ కష్టమర్లు యాక్ట్ ఆఫ్ గాడ్ నిబంధన కింద తమ లోన్లను రీషెడ్యూల్ చేయాలని కోరారట. అలాగే వాయిదా చెల్లింపులపై లేవీ ఇవ్వాలని విజ్ఞప్తులు చేశారు. ఈ మేరకు వందల కోట్ల విలువైన విజ్ఞప్తులు వచ్చాయట. అయితే ఆర్బీఐ రుణాల చెల్లింపుపై మారటోరియం విధించి కోట్లాది మందికి ఊరట కల్పించింది.
ఏడాది చివరి నాటికి..
త్వరలో కరోనా ఉత్పాతం నుంచి బయటపడితే ఈ ఏడాది చివరి క్వార్టర్ ఆశాజనకంగా ఉండవచ్చునని రుణదాతలు భావిస్తున్నారు. కరోనా ప్రభావం మరో ఆరు నెలల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి మూడు నుండి ఆరు నెలలు సమయం ఇవ్వాలని విజ్ఞప్తులు వచ్చాయట. ఈ విపత్తు అన్ని దాదాపు సంస్థలు, వ్యాపారాలు, వ్యక్తులపై ప్రభావం చూపుతోంది. కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం, ఆ తర్వాత ఆర్బీఐ ఈఎంఐల చెల్లింపును వాయిదా వేయడం భారీ ఊరటే అంటున్నారు.
మారటోరియంపై కొందరికి రెండు నెలలే..
ఆర్బీఐ మూడు నెలల మారటోరియం అన్ని టర్మ్ లోన్లకు వర్తిస్తుంది. వెహికిల్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్, అగ్రికల్చరల్ టర్మ్ లోన్, క్రాప్ లోన్ వంటి రిటైల్ లోన్లన్నింటికీ వర్తిస్తుంది. మారటోరియం మార్చి 1 నుండి మే 31 మధ్య మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. చాలామందికి ఈసీఎస్ మార్చి మొదటి వారంలోనే ఉంటుంది. ముఖ్యంగా ఆటో క్రెడిట్ కారణంగా ఎంతోమంది ఉద్యోగులు ఈఎంఐ ఇప్పటికే చెల్లించి ఉంటారు. వారికి మరో 2 నెలలు మాత్రమే ఆప్షన్ ఉంటుంది. మార్చి ఈఎంఐ చెల్లించిన వారికి ఇక ఏప్రిల్, జూన్ వరకు ఉండాలని అంటున్నారు.