మనీ ట్రాన్సుఫర్పై గుడ్న్యూస్: వారికి కూడా RTGS, NEFT సేవలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బులు ఒకరి నుండి మరొకరికి ట్రాన్సుఫర్ చేయడానికి ఉపయోగించే ఆర్టీజఎస్, నెఫ్ట్ సేవలను ఇప్పటి వరకు బ్యాంకులకు మాత్రమే వినియోగించుకునే వెసులుబాటు ఉంది. నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఉపయోగించుకునే వెసులుబాటు లేదు. ఇప్పుడు ఇందులో కేంద్ర బ్యాంకు మార్పులు చేసింది. కరోనా ఉధృతరూపం దాల్చుతున్న నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా ఉపయోగించవచ్చు
నెఫ్ట్, ఆర్టీజీఎస్ సౌకర్యాన్ని మరిన్ని సంస్థలకు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. నాన్-బ్యాంకింగ్ సిస్టం ఆపరేటర్లు కూడా నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలను పొందవచ్చు. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ పీపీఐ, కార్డు నెట్ వర్క్స్, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు, ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టం ప్లాట్ఫామ్స్ కూడా నెఫ్ట్, ఆర్టీజీఎస్ మనీ ట్రాన్సుఫర్ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు.
డిపాజిట్ పరిమితి పెంపు
పేమెంట్ బ్యాంకు డిపాజిట్ లిమిట్ పెంపు నిర్ణయం కూడా తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ పేమెంట్స్ బ్యాంకు డిపాజిట్ పరిమితిని రూ.1 లక్ష నుండి రూ.2 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది. డిపాజిట్ లిమిట్ పెంచాలని పేమెంట్ బ్యాంక్స్ ఎప్పటి నుండో ఆర్బీఐని కోరుతున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు కోసం లైసెన్స్ అందించేందుకు ఆర్బీఐ 2015లో 11 సంస్థలకు సూత్రపాయ ఆమోదం లభించింది.
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా..
కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం, పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇప్పుడున్న సర్దుబాటు విధాన వైఖరి కొనసాగింపునకు ఆర్బీఐ మొగ్గుచూపింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరుగుతున్న తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఇది. ధరల స్థిరత్వం, వృద్ధి, ఆర్థిక స్థిరత్వం లాంటి అంశాలపై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారించింది.