యథాతథంగా వడ్డీ రేట్లు, ఆర్థిక వ్యవస్థకు అవసరమైనంత కాలం ఇలాగే: శక్తికాంతదాస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం (డిసెంబర్ 8) ద్వైపాక్షిక సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. రెపో రేటును స్థిరంగా 4 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు దాస్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు అవసరమైనంత కాలం ఈ వడ్డీ రేటును అనుకూలంగానే కొనసాగిస్తామని తెలిపారు. రివర్స్ రెపో రేటును కూడా స్థిరంగా 3.35 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగించాలని ఎంపీసీ 5:1తో నిర్ణయించింది. రియల్ జీడీపీ వృద్ధి రేటును 9.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్ను తగ్గింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు.
ఒమిక్రాన్కు ముందు నుండే ఆర్బీఐ మరికొంతకాలం పాటు వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తుందనే అంచనాలున్నాయి. ఇప్పుడు ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందని ఆర్థికవేత్తలు భావించారు. అందరి అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించారు. ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లోను వడ్డీ రేట్లపై ఆర్బీఐ స్టేటస్-కోతో వెళ్తుందని ఆర్థికవేత్తలు తెలిపారు. రెపోరేటును స్థిరంగా కొనసాగిస్తారని, అయితే రివర్స్ రెపోరేటును 15 నుండి 20 బేసిస్ పాయింట్లు పెంచవచ్చునని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ దీనిని కూడా స్థిరంగా కొనసాగించారు.
సీపీఐ ద్రవ్యోల్భణం ఆగస్ట్ నెలలో 5.3 శాతం కాగా, సెప్టెంబర్ నెల నాటికి 4.3 శాతానికి తగ్గింది. అక్టోబర్ నెలలో ఇది 4.5 శాతంగా ఉంది. FY22లో ద్రవ్యోల్భణం అంచనాలను 5.3 శాతం నుండి 5.5 శాతానికి సవరించారు. FY22లో వృద్ధి అంచనాలు 9.5 శాతంగా గతంలోనే అంచనా వేసింది. దీనిని యథాతథంగా కొనసాగించింది.