రెండో త్రైమాసికం నుండి డిమాండ్ పుంజుకోవచ్చు: ఆర్బీఐ, వృద్ధి రేటు అంచనా సవరణ
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో డిమాండ్ క్షీణించి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందని, కేసులు తగ్గడంతో 2021-22 ఆర్థికసంవత్సరం రెండో త్రైమాసికం నుండి డిమాండ్ పుంజుకునే అవకాశం కనిపిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. అందరి అంచనాలు నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. కరోనా ఉద్ధృతి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈసారి కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు.
బ్యాడ్-లాగా మార్చేసిన బీజేపీ, idea of GST: RIP: చిదంబరం 10 పాయింట్స్...
అందుకే యథాతథం
ఏప్రిల్ నెలలో జరిగిన ద్వైమాసిక సమావేశంలో కూడా వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. ఇక కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ కాస్త నెమ్మదించిందని, దీంతో ఈసారి కూడా సర్దుబాటు విధాన వైఖరినే కొనసాగించనున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు.
వృద్ధి రేటు అంచనా సవరణ
2021-22 ఆర్థిక సంవత్సర జీడీపీ అంచనాలను ఆర్బీఐ 10.5 శాతం నుండి 9.5 శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు అంచనాలను 26.2 శాతం నుంచి 18.5 శాతానికి సవరించింది. ఈ ఏడాది సగటు వర్షపాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.1 శాతంగా నమోదు కావొచ్చునని అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 5.2 శాతం, రెండో త్రైమాసికంలో 5.4 శాతం ఉండవచ్చునని పేర్కొంది.
MSMEలకు ఆర్థిక సహకారం
MSMEలకు ఆర్థిక సహకారం కోసం రూ.16 వేల కోట్ల ద్రవ్యాన్ని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI)కు ఇస్తామని ఆర్బీఐ తెలిపింది. జీ-శాప్ 2.0 కింద జూన్ 17వ తేదీన రూ.40 వేల కోట్ల విలువైన సెక్యూరిటీస్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు శక్తికాంత దాస్. గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు కూడా డిపాజిట్ల సర్టిఫికేట్లు జారీ చేసేందుకు అనుమతి కల్పించింది ఆర్బీఐ.