RBI Rate Hike: సెప్టెంబరులో మళ్లీ వడ్డీ రేటు పెంపు.. సామాన్యులకు ఇంకెన్నాళ్లీ కష్టాలు.. స్పెషల్ రిపోర్ట్..
RBI Rate Hike: ఇప్పటికే వరుసగా మూడు సార్లు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచటంతో సామాన్యులకు, హౌసింగ్ లోన్ తీసుకున్న మధ్యతరగతి వారికి భారం పెరిగింది. ఈ తరుణంలో వచ్చే నెల సమీక్షా సమావేశంలో కూడా రెపో రేటును మళ్లీ ఆర్బీఐ పెంచనున్నట్లు సమాచారం.
CRISIL అంచనా ఇలా..
అయితే రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవశం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ తరుణంలో ఏడాది చివరినాటికి వడ్డీ రేట్ల పెంపును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేయవచ్చని ప్రఖ్యాత రేటింగ్ సంస్థ క్రిసిల్ లిమిటెడ్ ప్రధాన ఆర్థికవేత్త చెప్పారు. ద్రవ్యోల్బణం అంచనా వేసిన విధంగా ప్రవర్తిస్తే భారత్ వడ్డీ రేట్ల పెంపు చర్యల చివరి స్థాయికి వచ్చినట్లేనని ధర్మకీర్తి జోషి వెల్లడించారు.
ఈ సారి రేటు పెంపు ఇలా..
సెప్టెంబరు మాసంలో రిజర్వు బ్యాంక్ వడ్డీ రేటును కేవలం 25 బేసిస్ పాయింట్ల వరకు మాత్రమే పెంచవచ్చని CRISIL అంచనాలు చెబుతున్నాయి. దీని తరువాత ఏడాది చివరినాటికి మరొక్కసారి రేటు పెంపు ఉండవచ్చని తెలుస్తోంది. మే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మెుత్తం 140 బేసిస్ పాయింట్ల మేర రేటు పెంపు ఇప్పటి వరకు ఉంది.
తగ్గుతున్న ద్రవ్యోల్బణం..
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు క్రమంగా తగ్గుతోంది. వరుసగా 34 నెలల పాటు ద్రవ్యోల్బణ లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఏడు వరుస నెలల పాటు 2-6 శాతం టాలరెన్స్ పరిధికి వెలుపల ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా ఇటీవల గ్లోబల్ కమోడిటీ, ఆహార ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇది ఆర్బీఐ అంచనాలకు కొంచెం ఎక్కువ. వచ్చే ఏడాది సగటు ద్రవ్యోల్బణం దాదాపు ఐదు శాతంగా ఉంటుందని జోషి తెలిపారు.
ఏఏ రంగాల్లో అభివృద్ధి..
హాస్పిటాలిటీ, టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో వేగంగా అభివృద్ధి ఉండవచ్చని క్లిసిల్ తెలిపింది. వ్యవసాయం ద్వారా GDPకి పెద్దగా దెబ్బ ఉండకపోవచ్చని జోషి అంచనా వేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు అవసరమని తెలుస్తోంది. మెుత్తానిరి రానున్న కొన్ని నెలల్లో సాధారణ ప్రజలకు ఈ వడ్డీల పెంపు నుంచి ఉపశమనం కలగవచ్చని తెలుస్తోంది.