RBI వడ్డీ రేట్లను భారీగా పెంచొచ్చు.. రేటింగ్ ఏజెన్సీ హెచ్చరిక.. అదే కారణమంటూ..!
Rate Hike: ఇప్పటికే రెపో రేటును విపరీతంగా పెంచింది. దీంతో మార్కెట్లో లిక్విడిటీ తగ్గింది. అయితే ఇక రేట్ల తగ్గింపు చివరి అంకానికి చేరుకుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఆశలను అడియాశలు చేసే వార్త ఇప్పుడు మార్కెట్లోకి రావటం ప్రకంపనలు సృష్టిస్తోంది.
వాతావరణ ప్రకటన..
ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డు స్థాయికి వేడి చేరుకుంది. ఎండాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు, వేడి గాలులు భారీగా పెరగటం కారణంగా భారతీయ రిజర్వు బ్యాంక్ మరిన్ని రేట్ల పెంపుకు వెళ్లవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై దేశీయ రేటింగే ఏజెన్సీ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది.
ప్రధాన కారణాలు..
గడచిన 122 సంవత్సరాల్లో ఈ వేసవి అత్యంత వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలు గోధుమ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. గోధుమ ధరల పెరుగుదల డిసెంబర్, జనవరిలలో రిటైల్ ద్రవ్యోల్బణంలో పదవ వంతుకు పైగా కారణంగా నిలిచింది. ద్రవ్యోల్బణం లెక్కించే బాస్కెట్లో ఈ ధరల భారం పెరగటం కారణంగా రెపో రేటును రిజర్వు బ్యాంక్ పెంచవచ్చని రేటింగ్ సంస్థ హెచ్చరించింది.
పంజాబ్ ఉష్ణోగ్రతలు..
దేశం మళ్లీ "టెర్మినల్ హీట్ స్ట్రెస్"కు గురవుతుందని ఇండియా రేటింగ్స్ వెల్లడించింది. ప్రధానంగా గోధుమలు పండించే పంజాబ్ లో సగటున ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీల వరకు పెరిగాయని తెలుస్తోంది. అయితే ఈ కారణంగా గోధుమల ఉత్పత్తి 107.7 మిలియన్ టన్నులకు పడిపోవచ్చని దీని కారణంగా ధరలు పెరుగుతాయని అంచనా వేసింది.
కొత్త ఏడాది..
2023లో తొలి ఎంపీసీ సమావేశంలో రిజర్వు బ్యాంక్ రేట్ల దూకుడు తగ్గించి కేవలం 0.25 శాతం రెపో రేటును పెంచింది. దీంతో రెపో రేటు 6.50 శాతానికి చేరుకుంది. ఇప్పుడు రేటింగ్ సంస్థ అందించిన వివరాలను చూస్తుంటే రానున్న సమావేశంలో పెంపు కొనసాగవచ్చని రేటింగ్ సంస్థ తెలిపింది. గోధమలు, కూరగాయల, పాల ధరలు పెరగటం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దోహదపడనున్నట్లు అంచనా వేసింది.