ఈఎంఐ మరింత భారమవుతుందా? ఆర్బీఐ మరోసారి రెపో రేటును పెంచే అవకాశం!
కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రెపో రేటును వచ్చే పరపతి సమీక్షా సమావేశంలో మరోసారి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లుగా రెపో రేటు స్థిరంగా ఉంది. అయితే వచ్చే నెల ద్రవ్య పరపతి సమీక్ష (MPC) సందర్భంగా వడ్డీ రేట్లు పెరగవచ్చునని ఆర్థిక నిపుణులు భావించారు. కానీ అనూహ్యంగా ఈ నెలలోనే ఎమర్జెన్సీగా ఎంపీసీ సమావేశం నిర్వహించి, రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ. దీంతో 4 శాతం నుండి 4.4 శాతానికి పెరిగింది.
వచ్చే నెలలో కూడా ద్వైమాస ద్రవ్య పరపతి సమీక్షలో మరోసారి రెపోరేటు పెంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఏప్రిల్ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఫిబ్రవరి అంచనాల కంటే 120 బేసిక్ పాయింట్లు ఎక్కువ. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటును 7.8 శాతం నుండి 7.2 శాతానికి కుదించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) కూడా భారత జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతానికి ప్రకటించింది. వచ్చే నెల 6 నుండి 8 తేదీల మధ్య ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష జరగనుంది.
మార్చి నెలలో ద్రవ్యోల్భణం7 శాతంతో పదిహేడు నెలల గరిష్టానికి చేరుకుంది. ప్రధానంగా ఆహార ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్బీఐ లక్ష్యం 2 శాతం నుండి 6 శాతం కంటే ఇది ఎక్కువ. కరోనా నేపథ్యంలో 2020 నుండి ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇప్పుడు క్రమంగా పెంపును ప్రారంభించింది. వచ్చే ద్రవ్య పరపతి సమావేశంలో రెపో రేటును మరింత పెంచితే ఈఎంఐ మరింత భారమవుతుంది.