RBI hikes Repo Rate: ఆర్బీఐ కీలక నిర్ణయం, వడ్డీ రేటు పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా కేసులు తగ్గి ఆర్థిక రికవరీ కనిపిస్తోన్న నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం నాడు ప్రకటించారు. ఇప్పటి వరకు రెపో రేటు 4.00 శాతంగా ఉంది. ఇప్పుడు 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో 4.4 శాతానికి పెరిగింది. క్యాష్ రిజర్వ్ రేషియోను 50 బేసిస్ పాయింట్లు పెంచారు.
టెన్ ఇయర్ యీల్డ్స్ 28 బేసిస్ పాయింట్లు పెరిగి 7.4 శాతానికి చేరుకున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు. మార్చి 2022లో సీపీఐ ద్రవ్యోల్భణం 7 శాతంగా నమోదయిందని తెలిపారు. ప్రధానంగా ఆహార ద్రవ్యోల్భణం ప్రభావం చూపిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సరిహద్దు ఉద్రిక్తతలు ద్రవ్యోల్భణంపై ప్రభావం చూపాయని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఆర్బీఐ గవర్నర్ మధ్యాహ్నం కీలక ప్రకటన చేయనున్నారనే వార్తలు రావడంతో మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం గం.2 సమయంలో సూచీలు దాదాపు 600 పాయింట్ల నష్టాల్లోకి వెళ్లాయి. అయితే ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ప్రకటించడంతో మార్కెట్ కుప్పకూలింది. సెన్సెక్స్ 870 పాయింట్లు పతనమైంది.