వడ్డీ రేట్ల తగ్గింపు, రుణపునర్వ్యవస్థీకరణ: కాసేపట్లో ఆర్బీఐ శక్తికాంతదాస్ కీలక ప్రకటన!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) భేటీ మంగళవారం ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ మరోసారి కీలక నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దెబ్బతిన్న వివిధ రంగాలు ఆర్బీఐ వైపు చూస్తున్నాయి. ఈ రోజు (గురువారం, ఆగస్ట్ 6) మధ్యాహ్నం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని MPC ఈ మూడు రోజుల భేటీకి సంబంధించిన.. రెండు నెలల కాలం అనుసరించదగిన ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తారు. శక్తికాంతదాస్ ఏం చెబుతారోనని అందరూ వేచి చూస్తున్నారు.
చైనా సహా ఆ దేశాలకు ఇండియా షాక్, కలర్ టీవీల దిగుమతులపై కఠిన ఆంక్షలు
రెపో రేటు తగ్గిస్తారా?
ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అమెరికాలో వడ్డీ రేట్లు దాదాపు జీరోకు చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన వద్ద కూడా వడ్డీ రేట్లను మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే భారీగా తగ్గాయి. మరింతగా తగ్గిస్తే బ్యాంకింగ్ వ్యవస్థపై పడే ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రెపో తగ్గింపు రేటు ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. ఒకవేళ తగ్గించే పరిస్థితి ఉంటే 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చుననే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దేశ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు గత MPC సమావేశాల్లో రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. గత ఏడాది ఫిబ్రవరి నుండి మొత్తం 250 బేసిస్ పాయింట్లు తగ్గాయి.
రుణాల పునర్వ్యవస్థీకరణ, కార్పోరేట్ రుణాలు
రుణాలను పునర్వ్యవస్థీకరించాలని పారిశ్రామిక వర్గాల నుండి డిమాండ్లు వినిపించాయి. కార్పోరేట్ కంపెనీల కోసం ఏకకాల రుణ పునర్వ్యవస్థీకరణపై ప్రకటన వెలువడవచ్చునని భావిస్తున్నారు. ఈ నెలాఖరుతో రుణ వాయిదాలపై మారటోరియం ముగియనుంది. మారటోరియాన్ని పొడిగించాలని వివిధ రంగాలు కోరుతున్నాయి. దీనిపై ఆర్బీఐ తన నిర్ణయాన్ని తెలియజేయనుంది. మారటోరియంను రిటైల్ కస్టమర్ల కంటే కార్పోరేట్ సంస్థలే ఎక్కువగా వినియోగించుకుంటున్నాయని, ఆర్థికంగా బలంగా ఉన్న కార్పోరేట్లు ఉపయోగించుకునే మారటోరియాన్ని పొడిగించుకునే అవసరం లేదనేది కొందరి వాదన.
రిటైల్ ద్రవ్యోల్భణం..
వార్షిక రిటైల్ ద్రవ్యోల్భణం మార్చిలో 5.84 శాతం ఉండగా, జూన్ నెల నాటికి 6.09కి పెరిగింది. ఆర్బీఐ మీడియం టర్మ్ టార్గెట్ 2 శాతం నుండి 6 శాతం మధ్య ఉండగా, దానిని మించిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రెపో రేటును తగ్గించకుండా రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా ఊరట కల్పించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు వృద్ధి ఆగిపోకుండా ఉండేందుకు వ్యవస్థలు తెరుచుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ తీసుకునే చర్యలు వృద్ధికి తోడ్పడే విధంగా ఉంటాయని భావిస్తున్నారు.