చైనా కీలక వాణిజ్య భాగస్వామి, భారత్పై కరోనా వైరస్ ప్రభావం ఎంతంటే?
భారత్ పైన కరోనావైరస్ ప్రభావం పరిమితమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అయితే గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ట్రేడ్ పైన మాత్రం ప్రభావం కచ్చితంగా ఎక్కువే ఉంటుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చైనా మార్కెట్ ఎక్కువ అని, కాబట్టి చైనా ఎకానమీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందన్నారు.
భారీగా పెరిగిన బంగారం ధర: రూ.42,000 దాటి... రూ.45,000 దిశగా!
భారత్లో రెండు మూడు రంగాలపై ప్రభావం
కరోనా వైరస్ కారణంగా భారత్లో రెండు మూడు సెక్టార్లపై ఎక్కువ ప్రభావం పడుతోందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. ఆటో మొబైల్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వంటి వాటిపై భారీ ప్రభావం పడుతుందనే అంచనాలు తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా చైనాలో పరిశ్రమలు మూతబడి, ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ ప్రభావం ఎన్నో దేశాలపై ఉంది.
ముడి సరుకు వచ్చే ప్రావిన్స్లో కరోనా ప్రభావం లేదు
దేశంలోని ఫార్మా, ఎలక్ట్రానిక్ తయారీ రంగాలు చైనా ముడి సరుకులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని, కాబట్టి కరోనా ప్రభావం ఈ రంగాలపై ఎక్కుువగా ఉందన్నారు. ఫార్మాకు సంబంధించి ముడి సరుకు ముఖ్యంగా చైనా నుండి వస్తోందని, ప్రస్తుతం మన తయారీదారుల వద్ద మూడు నాలుగు నెలలకు సరిపడా మెటీరియల్ ఉందన్నారు. ముడి సరుకు వస్తున్న ప్రావిన్స్లో కరోనా ప్రభావం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఫార్మాలో ఇబ్బందులు తలెత్తకపోవచ్చునని చెప్పారు.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం చర్చలు
మొబైల్ హ్యాండ్ సెట్స్, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నామని, కరోనా వైరస్ నేపథ్యంలో భారతీయ ఉత్పత్తిదారులు ముడి సరుకుల కోసం ఇతర ఆసియా దేశాలతో చర్చిస్తున్నారని శక్తికాంత దాస్ చెప్పారు. కరోనా వైరస్ ప్రభావాన్ని ఏ దేశమైనా, ఏ పాలకులైనా నిశితంగా పరిశీలించాలని, దానిపై చర్యలు తీసుకోవాలన్నారు. భారత్ సహా ఏ దేశాలైనా విధాన నిర్ణయాలు తీసుకునే వారు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అప్పటికి ఇప్పటికి తేడా..
2003లో చైనాలో సంభవించిన సార్స్ మూలంగా అప్పుడు డ్రాగన్ కంట్రీ ఆర్థిక వృద్ధి 1 శాతం తగ్గిందని గుర్తు చేశారు. అప్పుడు ప్రపంచ జీడీపీలో చైనా వాటా 4.2 శాతంగా ఉందని, అలాగే ఆరో ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. ఇప్పుడు 16.3 శాతం జీడీపీతో, రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కచ్చితంగా పడుతుందన్నారు.
చైనా ముఖ్య వాణిజ్య భాగస్వామి
ఇండియా విషయానికి వస్తే చైనా ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి అన్నారు. ప్రభుత్వం, మానిటరీ అథారిటీ.. రెండు కూడా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. కరోనా వైరస్ ప్రభావాన్ని ఎంత త్వరగా నియంత్రిస్తే భారత్పై అంతగా ప్రభావం తగ్గుతుందన్నారు. ఎలక్ట్రానిక్ వంటి ఉత్పత్తులకు ముడి పదార్థాల కోసం మన కంపెనీలు ప్రత్యామ్నాయాలు చూడాలన్నారు.
ఐరన్ ఓర్ ఎగుమతి తగ్గితే..
భారత్ ఐరన్ ఓర్ను చైనాకు ఎగుమతి చేస్తుందని, దీనిపై ప్రభావం పడుతుందని శక్తికాంత దాస్ అన్నారు. ఐరన్ ఓర్ ఎగుమతి తగ్గడం వల్ల భారత్లో ఐరన్ సంబంధ వస్తువుల ధరలు తగ్గవచ్చునని అభిప్రాయపడ్డారు. వారి ఉత్పత్తి వ్యయం తగ్గుతుందన్నారు.