క్రిప్టో నిబంధనల దిశగా కేంద్రం, ఆర్బీఐ గవర్నర్ దాస్ కీలక వ్యాఖ్యలు
క్రిప్టో కరెన్సీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వర్చువల్ కరెన్సీల వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతాయని, అవి దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 29వ తేదీన మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీపై నిషేధం అవసరం లేదని, నియంత్రించాలనే అభిప్రాయాల నేపథ్యంలో గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ బ్యాంకింగ్ కార్యక్రమంలో మాట్లాడారు.
క్రిప్టోతో ప్రమాదం.. చర్చించాలి
క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థకు ఎంతటి ప్రమాదమనే విషయమై మరింత లోతుగా చర్చించాలని, తమకు వచ్చిన సమాచారం మేరకు క్రిప్టో కరెన్సీ అకౌంట్ తెరవడానికి రుణాలు ఇస్తున్నారని శక్తికాంతదాస్ అన్నారు. ట్రేడింగ్ నిర్వహించేందుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, అయితే మొత్తం అకౌంట్ నిల్వ రూ.500, రూ.1000, రూ.2000 వరకు మాత్రమే ఉంటోందని చెప్పారు. ఈ తరహా ఖాతాలు ఎనభై శాతం వరకు ఉన్నాయని, అయితే ఖాతాల సంఖ్య పెరగడంతో వర్చువల్ కరెన్సీల్లో ట్రేడింగ్, ట్రాన్సాక్షన్స్ వ్యాల్యూ పెరుగుతోందన్నారు.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అవసరమే కానీ
భారీ క్రెడిట్ను, ఎన్నో ప్రోత్సాహకాలను ఆశగా చూపి కొందరు క్రిప్టో ఖాతాలు తెరిపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. గత కొంతకాలంగా వర్చువల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్, ట్రేడింగ్ గణనీయంగా పెరిగిందని, అయితే ఖాతాల సంఖ్యను మాత్రం వాస్తవ సంఖ్యకు మించి చెబుతున్నారన్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఎప్పటికీ అవసరమే కానీ, దీని ఆధారంగా వచ్చిన క్రిప్టోలది భిన్న అంశమన్నారు.
ఆర్థిక వ్యవస్థ వేగవంతం
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని, ఇందుకు జీఎస్టీ కలెక్షన్స్ వంటివి నిదర్శనం అన్నారు. వృద్ధి స్థిరంగా కొనసాగాలన్నా, కరోనా ముందుస్థాయికి చేరుకోవాలన్నా ప్రయివేటు పెట్టుబడులు అవశ్యమని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలను 8.5 శాతం నుండి 10 శాతం మధ్య సవరిస్తున్నప్పటికీ, ఆర్బీఐ అంచనా 9.5 శాతంగా ఉంది.