కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, రికవరీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కూడా మరిన్ని చర్యలకు సిద్ధమని RBI గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని, మరిన్ని ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని దాస్ గతంలోనే ప్రకటించారు. తాజాగా, మరోసారి చర్యలకు సిద్ధమని ప్రకటించారు. దేశ ఆర్థిక రికవరీ సంకేతాలు ఇంకా పూర్తిస్థాయిలో కనిపించడం లేదని, వృద్ధికి ఊతమిచ్చే ఎలాంటి చర్యలు అయినా చేపడతామని, అలాంటి యుద్ధానికి ఎప్పుడూ సిద్ధమేనన్నారు. ఈ మేరకు బుధవారం ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ భేటీలో ఆయన మాట్లాడారు.

ఇంకా కోలుకోలేదు.. క్రమంగా కుదుటపడుతుంది
ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ఇంకా స్థిరపడాల్సి ఉందని శక్తికాంతదాస్ అన్నారు. కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుందని, జూన్, జూలై నెలల్లో కోలుకున్న కొన్ని రంగాలు ప్రస్తుతం స్తంభించిపోయాయని, అయినప్పటికీ ఈ ఏడాది చివరి నాటికి ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన జీడీపీ గణాంకాలపై కరోనా ప్రభావం కనిపించిందన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ, కేంద్రం చర్యలు తీసుకుంటాయన్నారు. వ్యవసాయం, వస్తు తయారీతో పాటు నిరుద్యోగ రేటుపై పలు ఏజెన్సీల అంచనాలు రెండో క్వార్టర్లవో ఆర్థిక కార్యకలాపాలు కొంత కుదుటపడతాయన్న సకేతాలు ఇస్తున్నాయన్నారు. చాలా రంగాల్లోక్షీణత తగ్గుముఖం పడుతోందని, ఆర్థిక పునరుద్ధరణలో పూర్తి స్థిరత్వం రాకపోగా, పునరుద్ధరణ నెమ్మదిగా జరిగే అవకాశం ఉందన్నారు.

వడ్డీ రేట్లు తగ్గాయి, బాండ్స్ ద్వారా నిధుల సేకరణ
ఆర్థికవృద్ధితో పాటు వ్యవస్థలో ద్రవ్యలభ్యత పెంపు, ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఆర్బీఐ సిద్ధమని శక్తికాంత దాస్ అన్నారు. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత వేగవంతమైన వృద్ధి పునరుద్ధరణకు దోహదపడే విధానాలు అవసరమన్నారు. ఇప్పటికే రెపో రేట్లు తగ్గించామని, దీంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల తగ్గుదల ప్రయోజనాలను కస్టమర్లకు అందించాయని, ద్రవ్య లభ్యత పెంపుతో ఆర్థిక సేవల మార్కెట్లో ఇబ్బందులు గణనీయంగా తగ్గాయన్నారు. మార్కెట్ను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే మరిన్ని చర్యలు చేపడతామన్నారు. ఆర్బీఐ ద్రవ్య విడుదల వల్ల ప్రభుత్వం భారీ మొత్తంలో రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు అందించడం, మార్కెట్కు భంగం కలగకుండా సేకరించగలిగిందన్నారు. ప్రభుత్వ బాండ్స్ పైన వడ్డీరేటు పదేళ్ల కనిష్టస్థాయిలో ఉందన్నారు. ఈ ఆగస్ట్ వరకు కార్పోరేట్ కంపెనీలు కూడా బాండ్స్ జారీ ద్వారా రూ.3.2 లక్షల కోట్లు సేకరించాయన్నారు. వృద్ధికి ఊతమిచ్చే చర్యలు.. అలాంటి యుద్ధానికి ఆర్బీఐ సిద్ధమని తెలిపారు.

NBFCలపై..
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం(NBFC) బలహీనంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని శక్తికాంత దాస్ అన్నారు. అగ్రస్థాయి NBFCలను ఆర్బీఐ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోందన్నారు. ఏ ఒక్క సంస్థ కూడా వైఫల్యం చెందకూడదనేదే తమ ఉద్దేశ్యం అన్నారు. il&fs తరహా సంక్షోభం పునరావృతం కాకుండా బ్యాంకులతో సమానంగా NBFCలకు కఠిన నిబంధనలు ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మరో సంస్థ విఫలం కాకూడదన్నదే తమ లక్ష్యమన్నారు.


Click it and Unblock the Notifications