సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్న్యూస్
ముంబై: డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను ప్రోత్సహించే లక్ష్యంతో నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్సుఫర్ (NEFT) సేవలను 24 గంటలూ కొనసాగించేలా నిర్ణయం తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కస్టమర్లకు మరో శుభవార్త కూడా చెప్పింది. నెఫ్ట్ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్స్ పైన జనవరి నుంచి ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే బ్యాంకులకు సంకేతాలు ఇచ్చింది. తాజాగా అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.
బ్యాంకు ఖాతాలో నగదు బదిలీలకు దేశంలో ఉన్న మార్గాలు
జనవరి 1, 2020 నుంచి నెఫ్ట్ పైన సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంకులకు సూచించింది. గత జూలై నెలలో నెఫ్ట్, ఆర్టీజీఎస్ పైన వర్తించే ఛార్జీల నుంచి బ్యాంకులకు ఆర్బీఐ మినహాయింపు ఇచ్చింది. తాజాగా, ఈ ప్రయోజనాన్ని అకౌంట్ హోల్డర్స్కు బదలీ చేయాలని సూచించింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ సహా మరిన్ని ఇతర బ్యాంకులు ఇప్పటికే ఖాతాదారుల నుంచి నెఫ్ట్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఇప్పుడు అన్ని బ్యాంకులు దీనిని అమలు చేయాలి.
కాగా, ఆర్బీఐ 24X7 నెఫ్ట్కు అనుమతించిన తర్వాత ఎనిమిది గంటల్లోనే 11.40 లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ వెసులుబాటు రెండు రోజుల క్రితం ప్రారంభమైంది. అనుమతించిన రోజు గం.12.00 AM నుంచి ఉదయం గం.8.00 AM వరకు 11.40 లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు వెల్లడించింది.