పేటీఎంకు ఆర్బీఐ షాక్, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా పేమెంట్ బ్యాంక్ పేటీఎంకు షాకిచ్చింది. కొత్త కస్టమర్ల చేరికను నిలిపివేయాలని, ఇది తక్షణమే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్బీఐ తాత్కాలికంగా ఆంక్షలను విధించింది. ఐటీ వ్యవస్థపై ఆడిట్ నిర్వహించేందుకు ఓ ఐటీ ఆడిట్ సంస్థను కూడా నియమించుకోవాలని తెలిపింది. బ్యాంకులో పర్యవేక్షణ లోపాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకున్నది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏలోని అధికారాలను ఉపయోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ఐటీ ఆడిటర్లు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని తదుపరి అనుమతులు ఇస్తామని వెల్లడించింది.
పేటీఎం పేమెంట్ బ్యాంక్ 2016లో ఏర్పాటయింది. 2017లో నోయిడా వేదికగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పేటీఎం విజయ్ శేఖర్ శర్మకు ఇందులో 51 శాతం వాటా ఉంది. 2020 డిసెంబర్ నెలలో ప్రయివేటు రంగ దిగ్గజం HDFC బ్యాంకుకు కూడా ఆర్బీఐ ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులో తరుచూ సాంకేతిక లోపాలు తలెత్తడంతో క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా తాత్కాలికంగా నిషేధం విధించింది.