ఒక్క ఏడాదిలోనే రూ.60,414 కోట్లు దోచుకున్నారు: బ్యాంకులపై ఆర్బీఐ షాకింగ్ రిపోర్ట్
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంలాంటిది బ్యాంకింగ్ వ్యవస్థ. బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ కార్యకలాపాలు ఒక్క రోజు స్తంభించిపోయినా లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుంటుంది. ఆన్లైన్ ద్వారా బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా ఎలా వినియోగంలోకి వచ్చాయో.. వాటి మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. బ్యాంకింగ్ మోసాల గురించి ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత అప్రమత్తం చేసినప్పటికీ.. వాటికి బ్రేకులు పడట్లేదు.
60,414 కోట్ల బ్యాంకింగ్ మోసాలు..
2021-2022 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న బ్యాంకింగ్ మోసాల విలువ రూ.60,414 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ స్వయంగా వెల్లడించింది. కొద్దిసేపటి కిందటే విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని పొందుపరిచింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అంటే 2020-21తో పోల్చి చూస్తే.. కాస్తంత తగ్గినట్టే. 1.38 ట్రిలియన్ల నుంచి 60,414 కోట్ల రూపాయలకు ఈ బ్యాంకింగ్ మోసాలు తగ్గాయని ఆర్బీఐ పేర్కొంది.
లక్షకు తక్కువ కాకుండా..
లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తానికే ఖాతాదారులు మోసపోయారని తెలిపింది. లక్ష రూపాయల కంటే తక్కువ మొత్తానికి మోసాలు జరగలేదని తెలిపింది. అత్యధికంగా ప్రైవేట్ బ్యాంకుల ద్వారానే ఇవి సంభవించాయి. ప్రైవేటు బ్యాంకుల్లో మోసాల సంఖ్య అధికంగా ఉండగా.. జాతీయ బ్యాంకుల్లో మోసపోయిన అమౌంట్ అధికంగా రికార్డయింది. ప్రైవేటు బ్యాంకుల్లో లక్ష నుంచి రెండు లక్షల రూపాయల లోపు కార్డులు/ఇంటర్నెట్ మోసాలు అధికంగా చోటు చేసుకున్నాయి.
లోన్ పోర్ట్ఫోలియోల్లో
పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో లోన్ పోర్ట్ఫోలియోల్లో ప్రధానంగా ఈ మోసాలు పెద్ద ఎత్తున సంభవించాయి. రుణాలను మంజూరు చేసే విషయంలో పెద్ద ఎత్తున మోసాలు సంభవించినట్లు రిజర్వుబ్యాంక్ తెలిపింది. అడ్వాన్సెస్ కేటగిరీలో ఇవి పెద్ద ఎత్తున సంభవించినట్లు పేర్కంది. దీని విలువ 58,328 కోట్ల రూపాయలు. మిగిలినవి కార్డులు/ఇంటర్నెట్ మోసాలుగా తేల్చింది రిజర్వుబ్యాంక్.
మోసాల విలువ ఇదీ..
ఈ ఆర్థిక సంవత్సరం ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో 5,334, పబ్లిక్ సెక్టార్-3,078, భారత్లో కార్యకలాపాలను నిర్వహించే విదేశీ బ్యాంకులు-494, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు-155, పేమెంట్స్ బ్యాంకులు-30, ఆర్థిక సంస్థలు-10, స్థానికంగా పని చేసే చిన్న తరహా బ్యాంకుల్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రైవేట్ బ్యాంకుల్లో సంభవించిన మోసాల విలువ రూ.40,282 కోట్ల రూపాయలు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు-17,588, ఆర్థిక సంస్థలు-1,305, విదేశీ బ్యాంకులు-1,206, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు-30 కోట్ల రూపాయల చొప్పున ఖాతాదారులు మోసపోయారు.